విద్యానగర్, జనవరి 12: ఆడబిడ్డల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అనేక పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. కామారెడ్డి నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన 449 మంది లబ్ధిదారులకు 4 కోట్ల 49 లక్షల 52 వేల 84 రూపాయల విలువైన కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులను స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహంలో ఆయన గురువారం పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ.. రెండో సారి తమ పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం ఇప్పటి వరకు నియోజకవర్గంలో 8,346 మందికి 83 కోట్ల 16 లక్షల 35 వేల 816 రూపాయల విలువైన కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేశామన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ పరికి ప్రేమ్ కుమార్, కామారెడ్డి ఎంపీపీ పిప్పిరి ఆంజనేయులు, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జూకంటి ప్రభాకర్రెడ్డి, పార్టీ అధికార ప్రతినిధి బల్వంత్ రావు, నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.