కామారెడ్డి, సెప్టెంబర్ 12 :ఉపాధ్యాయ ఉద్యోగాలకు ప్రధానమైన ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) ఉమ్మడి జిల్లాలో ఈ నెల 15న శుక్రవారం నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. టెట్ కోసం ఉమ్మడి జిల్లాలో పేపర్-1, పేపర్-2కు మొత్తం 157 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా 51,839 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. గంట ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచించారు. టెట్ దృష్ట్యా ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపనున్నది. పేపర్ 1 ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు,పేపర్ 2 మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు.
ఉపాధ్యాయ అర్హత పరీక్షను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తిచేశారు. టెట్ నిర్వహణకు 300 ఇన్విజిలేటర్లను నియమించారు. 27డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, 27 చీఫ్ సూపరింటెండెంట్, 48 మంది హాల్ సూపరింటెండెంట్, 4 ఫ్లయింగ్ స్కాడ్స్ నియమించగా, ఒక్కో పరీక్షా కేంద్రంలో 240 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని సంబంధిత శాఖకు ఉన్నతాధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయనున్నారు.
హెల్ప్డెస్క్ సెంటర్ల ఏర్పాటు..
అభ్యర్థులకు ఇబ్బంది కలుగకుండా సందేహాల నివృత్తి కోసం రెండు జిల్లాల్లో ప్రత్యేక హెల్ప్డెస్క్లను ఏర్పాటు చేశారు. సందేహాలు ఉంటే కామారెడ్డి జిల్లా అభ్యర్థులు 7661854856, నిజామాబాద్ జిల్లా అభ్యర్థులు 9030282993 నంబర్కు కాల్ చేయాలని సూచించారు. అభ్యర్థులు తమ హాల్టికెట్లలో పేరు, పరీక్షా కేంద్రాల చిరునామా తదితర పొరపాట్లు ఉంటే హెల్ప్డెస్క్ను సంప్రదించాలని పేర్కొన్నారు. హాల్టికెట్పై అభ్యర్థి ఫొటో, సంతకం తప్పనిసరిగా ఉండాలని, లేనివారు గెజిటెడ్ అధికారితో ధ్రువీకరణ పత్రం తీసుకోవాలని తెలిపారు.