ఖలీల్వాడి, ఫిబ్రవరి 8: పోడు భూములకు సంబంధించిన ప్రక్రియను ఈనెల 15లోగా పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని, గడువు కన్నా ముందే పూర్తి వివరాలతో సిద్ధంగా ఉండాలని కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆదేశాలు వెలువడిన వెంటనే అర్హులైన వారికి ఆర్వోఎఫ్ఆర్ పట్టాలను అందించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలన్నారు. కలెక్టర్ అధ్యక్షతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం మీటింగ్ హాల్లో ఆర్వోఎఫ్ఆర్ జిల్లాస్థాయి కమిటీ మలి విడుత సమావేశం బుధవారం నిర్వహించారు.
పోడు భూములకు సంబంధించిన క్లెయిమ్లు, క్షేత్రస్థాయి పరిశీలన వివరాలు, గ్రామసభల తీర్మానాలు తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. డివిజనల్ స్థాయి కమిటీలో ఆమోదం పొందినప్పటికీ పలు సాంకేతిక కారణాలతో పెండింగ్లో ఉన్న క్లెయిమ్లను రెండు రోజుల్లో పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. తిరస్కరించిన క్లెయిమ్లను మరోమారు క్షుణ్ణంగా పరిశీలించాలని, ప్రభుత్వ నిబంధనలకు లోబడి అర్హులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. జిల్లాస్థాయి కమిటీకి అందిన నివేదికలను త్వరగా పరిశీలించాలని, క్లెయిమ్ల ఆమోదం లేదా తిరస్కరణకు గురైన వాటికి సంబంధించి స్పష్టమైన ఆధారాలను పొందుపర్చాలని సూచించారు.
క్లెయిమ్ల పరిశీలన వివరాలను ఎలాంటి తప్పిదాలు లేకుండా కంప్యూటరీకరించాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా నిర్ణీత డిజైన్లో పట్టా పాస్బుక్ల పంపిణీకి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు చిత్రామిశ్రా, బి.చంద్రశేఖర్, గిరిజన సంక్షేమశాఖ జిల్లా అధికారి నాగూరావు, ఆర్డీవోలు రవి, రాజేశ్వర్, శ్రీనివాస్, అటవీశాఖ అధికారులు, జిల్లా కమిటీ సభ్యులైన భీమ్గల్, మోపాల్, సిరికొండ మండలాల జడ్పీటీసీలు చౌట్పల్లి రవి, కమలా బానోత్, మాలావత్ మాన్సింగ్ తదితరులు పాల్గొన్నారు.