పేదల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కంటివెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఎంతో మంది పేదలు కంటి సమస్యలతో బాధపడుతున్నా ఆర్థిక స్థోమత లేక దవాఖానలకు వెళ్లలేక పోతున్నారు. ఇలాంటి వారికి కేసీఆర్ ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. కంటి సమస్యలతో బాధ పడుతున్న వారికి ఉచితంగానే పరీక్షలు నిర్వహించనున్నది. ఇప్పటికే ‘కంటివెలుగు’ మొదటి విడుత విజయవంతంగా పూర్తవగా, ఈ నెల 18 నుంచి రెండో విడుత ప్రారంభం కానుంది. నిజామాబాద్లో 70, కామారెడ్డిలో 44 బృందాలు ఊరూరా సేవలందించనున్నాయి. కంటి వెలుగు శిబిరాలను నిర్వహించే వేదికలను ఇప్పటికే నిర్ణయించారు. ఒక్కో బృందంలో కంటి వైద్యులు, కంటి పరీక్షల నిపుణుడు, డాటా ఎంట్రీ ఆపరేటర్లను నియమించారు. శిబిరాలను సద్వినియోగం చేసుకొనేలా చర్యలు చేపట్టారు. ఈ మేరకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
నిజామాబాద్, జనవరి 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) :పేదల కండ్లల్లో వెలుగులు నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరోమారు సిద్ధమవుతోంది. కంటి సమస్యలతో బాధపడుతున్న వారికి చేయూతనిచ్చేందుకు కంటి వెలుగు కార్యక్రమాన్ని మరోసారి తీసుకువస్తున్నది. ఈ కార్యక్రమం కింద మొదటి విడుతలో లక్షలాది మందికి కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి కంటి అద్దాలు పంపిణీ చేశారు. తీవ్రమైన సమస్యలు, శస్త్ర చికిత్స అవసరం ఉన్నవారికి వైద్యపరంగా అండగా నిలిచారు.
రెండో విడుత కంటివెలుగు కార్యక్రమాన్ని జనవరి 18 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించనున్న నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అందుకు సమాయత్తం అవుతున్నది. ఈ మేరకు ఉమ్మడి జిల్లాలో వైద్యారోగ్య శాఖ విస్తృత ఏర్పాట్లను చేసింది. ఇంకా వారం రోజుల సమయం ఉండడంతో శిబిరాల నిర్వహణ, మౌలిక సదుపాయాలపై దృష్టి సారించింది. మరోవైపు తొలి విడుతలో మండలానికో బృందాన్ని మాత్రమే నియమించారు. ఈసారి బృందాల సంఖ్యను రెట్టింపు చేశారు. నిజామాబాద్లో 70, కామారెడ్డిలో 44 బృందాలను ఏర్పాటు చేశారు. కంటి వెలుగు ద్వారా పేద, మధ్య తరగతి వర్గాలకు ఎంతో ఊరట లభించనున్నది. కంటి సమస్యలతో బాధపడే వారికి ఊర్లోనే శిబిరాలు ఏర్పాటు చేయడం ద్వారా ఎనలేని మేలు చేకూరనున్నది.
నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 33 మండలాలకు మొత్తం 70 బృందాలను ఏర్పాటు చేశారు. వీరు సుమారు 10లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహిస్తారు. గ్రామాలు, పట్టణాల్లో కంటి వెలుగు శిబిరాలను నిర్వహించే స్థలాలు, వేదికలను ఇప్పటికే వైద్యారోగ్య శాఖ నిర్ణయించింది. శిబిరంలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక్కో బృందంలో కంటి వైద్యుడు, కంటి పరీక్షల నిపుణుడు, డాటా ఎంట్రీ ఆపరేటర్లను ప్రభుత్వం నియమించింది. శిబిరాలకు ప్రజలు భారీగా తరలివచ్చి లబ్ధిపొందేలా యంత్రాంగం ప్రయత్నాలు చేపట్టింది. ఈ మేరకు గ్రామ, పట్టణ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. మరోవైపు సోషల్ మీడియాలోనూ విస్తృతంగా ప్రచారం కల్పిస్తున్నారు. గ్రామ పంచాయతీల్లో చాటింపు వేయడంతోపాటు వాల్పోస్టర్ల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
కామారెడ్డి జిల్లాలో రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమంలో దాదాపు 8 లక్షల మందికి పరీక్షలు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం 40 బృందాలను ఏర్పాటు చేశారు. జనవరి 18 నుంచి ప్రారంభం కానున్న ఈ కార్యక్రమానికి అధునాతన యంత్రాలను సైతం ప్రభుత్వమే సమకూరుస్తున్నది. మొదటి విడుతలో 4లక్షల 83వేల 581 మందికి కేవలం 20 బృందాలతోనే కంటి పరీక్షలను పూర్తి చేశారు. ఇందులో 3లక్షల 9వేల 224 మందికి ఎలాంటి కంటి సమస్యలు లేవని ఈ శిబిరాల్లో నిర్ధారించారు. కంటి సమస్యలతో బాధపడుతన్న 71,459 మందికి అద్దాలను ఉచితంగా అందించారు. తీవ్రమైన సమస్య ఉన్న వారికి హైదరాబాద్లో ప్రత్యేకంగా తయారు చేయించిన కంటి అద్దాలను గ్రామాలకు తెప్పించి 20,894 మందికి అందజేశారు. ఈసారి బృందాల సంఖ్యను భారీగా పెంచారు. ఒక్కో మండలంలో రెండు టీములు పర్యటిస్తాయి. గ్రామాల్లోనే శిబిరాలను ఏర్పాటు చేసుకొని పరీక్షలు చేస్తారు. కంటి వెలుగు కార్యక్రమంలో పాల్గొనే సిబ్బందికి అవగాహన కార్యక్రమాలు సైతం పూర్తిచేశారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో) వెలువరించిన గణాంకాల ప్రకారం ప్రస్తుత అలవాట్లు, కాలుష్య కారకాలతో కంటికి సంబంధించిన వ్యాధులు పెరుగుతున్నట్లుగా తెలుస్తున్నది. వేలకు వేల డబ్బులు ఖర్చుపెట్టి కంటి చికిత్స చేయించుకునే స్థోమత లేనివారు అలాగే కాలం వెల్లదీస్తున్నారు. ఇలాంటి దుస్థితిని దూరంచేసి ఆరోగ్య తెలంగాణగా మార్చేందుకు సీఎం కేసీఆర్ రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమంలా కంటి వెలుగు కార్యక్రమాన్ని మరో విడుత అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. తన స్వీయ అనుభవంలో ఎదురైన ఘటనను ఆధారంగా తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశంతో అభాగ్యులకు లబ్ధి కలుగనున్నది.
రాష్ట్ర ప్రభుత్వం తెస్తున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతాం. ప్రభుత్వ ఉద్దేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు అర్హులైన వారందరికీ కంటి పరీక్షలు చేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ కార్యక్రమంతో పేద వర్గాలకు ఎంతో మేలు జరుగుతుంది. కంటి లోపాలు ఉన్నట్లు గుర్తిస్తే ఉచితంగానే వైద్యం, కంటి అద్దాలను అందిస్తాం. వైద్య బృందాలు ఊరూరా వెళ్లి పరీక్షలు నిర్వహిస్తాయి. ఇది మానవీయ కోణంలో అమలు చేస్తున్న గొప్ప కార్యక్రమం. ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలి.
– నారాయణ రెడ్డి, కలెక్టర్,నిజామాబాద్