వేతనాలు రాక మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (వీబీజీ రామ్జీ) సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మూడు నెలలుగా జీతాలు రాకపోవడంతో సతమతమవుతున్నారు. అప్పులు తెచ్చి కుటుంబాలను పోషించుకోవాల్సిన పరిస్థితి తలెత్తిందని వాపోతున్నారు. ఉపాధి హామీ పథకంలో ఏపీవో, టెక్నికల్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు పని చేస్తున్నారు. అయితే, గత మూడు నెలలుగా వారికి వేతనాలు రావడం లేదు. దీంతో కుటుంబ పోషణ భారంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించిన వేతనాలు ఇవ్వాలని కోరుతున్నారు.
– కోటగిరి, ఏప్రిల్ 10
దాదాపు 20 సంవత్సరాల నుంచి ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్గా నుంచి చేస్తున్నా. గతంలో ఎలాంటి వేతనాల సమస్య లేకుండే. ఈ మధ్యే జీతాలు సరిగా రావడం లేదు. మూడు నెలల నుంచి వేతనాలు రాకపోవడంతో అప్పు చేయాల్సి వస్తున్నది. వచ్చే జీతం (రూ.12,370)లో సమావేశాలు, పని ప్రదేశాలకు వెళ్లడానికే రూ.2 వేలు ఖర్చువుతుంది. ఇచ్చేదే తక్కువ జీతం. అది కూడా సక్రమంగా ఇవ్వకుంటే ఎలా బతికేది?
– గైనీ సరోజా, ఫీల్డ్ అసిస్టెంట్, యాద్గార్పూర్
జనవరి నుంచి వేతనాలు రావడం లేదు. వచ్చేదే అరకొర. అది కూడా సరిగా ఇవ్వకుంటే ఎలా? జీతాలు ఇవ్వకుంటే కుటుంబాలను ఎలా పోషించాలి? నిత్యావసరాల కోసం అప్పులు చేయాల్సి వస్తున్నది. జీతాలు చెల్లించాలని ఎన్నిసార్లు విన్నవించుకుంటున్నా పట్టించుకునే వారు లేరు. అధికారులు మాత్రం మాతో పనులు చేయించుకుంటున్నారు. కానీ వేతనాల ఊసే ఎత్తడం లేదు. ఉన్నతాధికారులు స్పందించి వేతనాలు వెంటనే చెల్లించాలి.
– దేగం శంకర్, ఫీల్డ్ అసిస్టెంట్, బస్వాపూర్
ఉమ్మడి కోటగిరి మండలంలో ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లకు వేతనాలు రాక మూడు నెలలు దాటిన విషయం వాస్తవమే. కార్యాలయ నిర్వహణ నిధులు రాక ఇబ్బంది పడుతున్నారు. సిబ్బంది, ఫీల్డ్ అసిస్టెంట్లు వేతనాలు రాక ఇక్కట్లు పడుతున్న విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం.
– గంగారాం, ఏపీవో, కోటగిరి