ఖలీల్వాడి, జనవరి 17 : దృష్టి లోపాలను దూరం చేసేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కంటి వెలుగు రెండో విడుత కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఈ నెల 19న జిల్లా కేంద్రంలోని వినాయక్నగర్లో ఉన్న మహిళా భవనంలో ఉదయం 9 గంటలకు కంటివెలుగు శిబిరాన్ని ముఖ్యఅతిథులచే లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ మేరకు ప్రారంభోత్సవ ఏర్పాట్లను కలెక్టర్ నారాయణరెడ్డి మంగళవారం పరిశీలించారు. లోపాలకు తావులేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్లు చిత్రామిశ్రా, చంద్రశేఖర్, ఆర్డీవో రవి, డీఎంహెచ్వో సుదర్శనం, మెప్మా పీడీ రాములు, సీడీపీవో సౌందర్య తదితరులు ఉన్నారు.
నిర్లక్ష్యం చేస్తే వేటు తప్పదు..
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కంటి వెలుగు నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వేటు తప్పదని కలెక్టర్ నారాయణరెడ్డి హెచ్చరించారు. కంటి వెలుగు కేవలం వైద్యారోగ్య శాఖకు సంబంధించినది మాత్రమే కాదని, ఇది అందరి కార్యక్రమం అయినందున అన్ని శాఖల అధికారులు, సిబ్బంది సమష్టి కృషితో విజయవంతం చేసి జిల్లాకు మంచి పేరు తేవాలని హితవు పలికారు. మంగళవారం సాయంత్రం కలెక్టర్ కంటి వెలుగు కార్యక్రమం ఏర్పాట్లపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. కంటి వెలుగు విధుల నిర్వహణలో అలసత్వం ప్రదర్శించిన బోధన్ హోమియో డిస్పెన్సరీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ హైమావతిని సస్పెండ్ చేయాల్సిందిగా డీఎంహెచ్వోను ఆదేశించారు. గ్రామపంచాయతీ కార్యదర్శులు, ఆశ వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, వీవోఏలు స్థానికంగా అందుబాటులో ఉంటూ శిబిరాల నిర్వహణకు పూర్తి సహకారమందించాలన్నారు. శిబిరం ముగిసేంత వరకు ఎవరూ సెలవుల్లో వెళ్లడానికి వీలు లేదని కలెక్టర్ స్పష్టం చేశారు.
కంటి పరీక్షా శిబిరాల నిర్వహణ కోసం వచ్చే బృందాలకు ఇంటి వాతావరణాన్ని తలపించేలా నాణ్యమైన వసతి, భోజన సదుపాయాలను సమకూర్చాలని ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లకు సూచించారు. శిబిరాల వద్ద మౌలిక సదుపాయాలు కల్పించాలని, విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. 18 సంవత్సరాలు పైబడిన ప్రతిఒక్కరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. ప్రతిరోజూ కనీసం 120 నుంచి 130 మందికి కంటి పరీక్షలు నిర్వహించాలన్నారు. అవసరమైన వారికి కంటి అద్దాలు, మందులు అందించాలని, క్యాటరాక్ట్ సర్జరీ అవసరమైన వారిని నిజామాబాద్ జీజీహెచ్ దవాఖానకు రిఫర్ చేయాలని కలెక్టర్ సూచించారు. జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం పనుల ఆడిట్ వివరాలను సంబంధిత పోర్టల్లో వెంటనే అప్లోడ్ చేయాలని ఏపీవోలను ఆదేశించారు. వచ్చే మంగళవారం నాటికి అప్లోడ్ ప్రక్రియను పూర్తి చేయాలని గడువు విధించారు. వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, జడ్పీ సీఈవో గోవింద్, డీపీవో జయసుధ, మెప్మా పీడీ రాములు, డీఎంహెచ్వో సుదర్శనం, డాక్టర్ కృష్ణ, డీఆర్డీవో ఏపీడీ సంజీవ్ ఆయా మండలాల అధికారులు పాల్గొన్నారు.