కమ్మర్పల్లి, ఫిబ్రవరి 20: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు, మిడ్ మానేరు డ్యాం (ఎంఎండీ) ఆయకట్టు రైతుల ప్రయోజనా ల కోసం అవసరమైతే పోరాటం చేస్తామని మాజీ మంత్రి, బాల్కొం డ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి స్పష్టం చేశారు. వరద కాలువకు కేటాయింపు కన్నా ఎక్కువగా నీరు వదలొద్దని అధికారులను కోరారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి మిడ్ మానేరు డ్యామ్ వరకు గల ఆయకట్టును కాపాడుకోవాల్సిన అవసరమున్నదన్నారు. మంగళవారం బాల్కొండ నియోజకవర్గంలో పర్యటించిన ప్రశాంత్రెడ్డి.. మార్గమధ్యంలో ఉప్లూర్ వరద కాలువ వద్ద ఆగారు. దిగువకు నీరు వెళ్తుండడాన్ని గమనించిన ఆయన.. అక్కడి నుంచే ఎస్సారెస్పీ ఎస్ఈకి ఫోన్ చేశారు. ప్రాజెక్టులో నీటి స్టోరేజీ ఎంత ఉంది.. ఈ సీజన్లో పంటల సాగుకు ఎన్ని టీఎంసీల నీరు అవసరమవుతుందని అడిగి తెలుసుకున్నారు. కేటాయింపు కన్నా ఎక్కువగా నీటిని వరద కాలువకు వదలొద్దని సూచించారు.
ప్రభుత్వం ఎక్కువగా నీటిని విడుదల చేయాలని నిర్ణయిస్తే తనకు చెప్పాలని, తాను ప్రభుత్వంతో పాటు ఇరిగేషన్ అధికారులతో మాట్లాడతానని చెప్పారు. వరద కాలువపై నాగపూర్ వద్ద నిర్మించిన నాలుగు గేట్లలో ఒక గేటు నుంచి పూర్తిగా, మరో గేటు నుంచి పాక్షికంగా నీరు కిందకు వెళ్తుందని రైతులు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. దీంతో మరోమారు ఎస్ఈకి కాల్ చేసిన ప్రశాంత్రెడ్డి.. వరద కాలువ ద్వారా నీరు వదలడం లేదని తమను తప్పుదోవ పట్టించొద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు సమాచారం ఇవ్వొదని చెప్పారు. గేట్ల వద్ద తేనెతుట్టె ఉందని మూయకుండా నీరు దిగువకు వృథాగా పోనియడం సబబు కాదన్నారు. అవసరమైతే స్థానిక గ్రామాల ప్రజాప్రతినిధుల సహకారంతో తేనెతుట్టెను తొలగించి, వెంటనే నాగపూర్ వద్ద ఉన్న గేట్లను మూసి వేయించాలని సూచించారు.