మనిషి తన జీవనంలో అడుగడుగునా ఎదురయ్యే సవాళ్లు, సమస్యలను ఎదుర్కోవడం కోసం ఎంతో ఆలోచిస్తూ ఒత్తిడికి లోనుకావల్సివస్తుంది. దీంతో ప్రశాంతతకు భంగంకలిగి ఆందోళనకు గురవుతున్నారు. దీంతో మానసిక స్థితిపై ప్రభావం చూపి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. హైబీపీ, షుగర్, నిద్రలేమితో ఏకాగ్రత కోల్పోయి ఒత్తిడికి లోనై ప్రశాంతతకు దూరమవుతున్నారు. వీటన్నింటినీ సులువుగా ఎదుర్కొనేందుకు ధ్యానం ఒక్కటే మార్గమని నిపుణులు, వైద్యులు చెబుతున్నారు.
శ్వాసమీద ధ్యాసతో ఏకాగ్రత వచ్చి ధ్యానంలోకి సులువుగా చేరుకోవచ్చని పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూమెంట్ (పీఎస్ఎస్ఎం)సభ్యులు తెలుపుతున్నారు. కొన్ని రోజులుగా ఆర్మూర్ ప్రాంతంతోపాటు చుట్టుపక్కల (పీఎస్ఎస్ఎం)కేంద్రాలతో ప్రజల్లో ధ్యానంపై అవగాహన పెరిగి నిత్యం ధ్యాన సాధన చేస్తున్నారు. ధ్యానంతో ప్రశాంతత, ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, ఆత్మవిశ్వాసం, ఆత్మైస్థెర్యం, శరీరంలో రోగ నిరోధకశక్తి పెరుగుతాయి. ధ్యానంతో మనిషిలో ఆందోళన, ఆవేశం, మూర్ఖత్వం లాంటివి దూరమవుతాయి. పెద్దస్థాయిలో విజయాలు సాధించి ఉన్నత స్థానాలకు చేరుకున్నవారిలో ఎక్కువ మంది ధ్యాన సాధకులేనని, ధ్యానం చేసేవారిలో ఆత్మైస్థెర్యం, పట్టుదల పెరిగి విజయాలవైపు దూసుకుపోతారని ధ్యానానికి కులం, మతంలాంటి తేడాలు లేవని ఎవరైనా ధ్యాన సాధన చేయచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.
సాధారణ ధ్యానం కన్నా పిరమిడ్ ధ్యానానికి ఎన్నో రేట్ల శక్తి ఉంటుందని, పిరమిడ్ కింద, పిరమిడ్ లోపల కూర్చొని ధ్యానం చేయాలని, పిరమిడ్ విశ్వశక్తిని ఆకర్షిస్తుందని ఇది శాస్త్రీయంగా రుజువయ్యిందని పిరమిడ్ మాస్టర్లు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా పిరమిడ్ ధ్యానానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉందంటున్నారు.
గతంలో ధ్యానం కేవలం పట్టణాలకే పరిమితం, ఇప్పుడు పల్లెల్లో ధ్యాన పరిచయం ఎంతో పెరిగింది. పిల్లల నుంచి వృద్ధుల వరకూ, నిరక్షరాస్యులు సైతం ధ్యానానికి అలవాటుపడిపోయి జీవనశైలిలో ఒక భాగంగా చేసుకున్నారు. ధ్యానంతో కలుగుతున్న ప్రయోజనాలు, తీరుతున్న ఆరోగ్య సమస్యలను గమనించి ఒకరి నుంచి ఒకరు తెలుసుకొని ధ్యాన కేంద్రాలకు వెళ్లడం లేదా తమ ఇండ్లలోనే నిత్యం ధ్యాన సాధన చేస్తున్నారు. దీంతోపాటు ప్రతి ఆదివారం ధ్యాన కార్యక్రమాలకు వెళ్తున్నారు. హ్యాపీ సండే పేరుతో పీఎస్ఎస్ఎం నిర్వహించే కార్యక్రమాల్లో పండుగ వాతావరణం కనిపిస్తున్నది. చిన్నాపెద్దా అంతా కలిసి సామూహిక ధ్యానం చేసి ఆటపాటలతో ఉల్లాసంగా గడుపుతున్నారు.
ప్రజల్లో పిరమిడ్ ధ్యానానికి ప్రాధాన్యత పెరిగింది. జిల్లాలో రెండు, మూడు సంవత్సరాల్లో వందలాది పిరమిడ్లు నిర్మితమయ్యాయి. ఆధ్యాత్మిక కేంద్రాలే కాకుండా తమ ఇండ్లపై పిరమిడ్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇంటిపైన వేసుకునే ఎంత చిన్న సైజు పిరమిడ్ అయినా కనీసం రూ. 50వేలకు పైనే ఖర్చవుతుంది. ఖర్చుకు వెనకాడకుండా పిరమిడ్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆర్మూర్లోని నవసిద్దుల గుట్టపై నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రం ట్రస్టు, పీఎస్ఎంస్ఎం ద్వారా సువిశాలమైన స్థలంలో తెలంగాణలోనే రెండో అతి పెద్ద పిరమిడ్ను నిర్మిస్తున్నారు. సుమారు రూ. కోటి వ్యయంతో నిర్మాణం జరుగుతున్నది. ప్రస్తుతం నిర్మాణం తుదిదశకు చేరుకున్నది. ఆర్మూర్కు నలుదిక్కుల నుంచి ఈ పిరమిడ్ కనిపిస్తున్నది. వచ్చే ఏడాది జనవరిలో ఈ పిరమిడ్ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఇక్కడ ధ్యాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నందిపేట్ కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు మంగి రాములు మహరాజ్తోపాటు ధ్యాన మాస్టర్ల పర్యవేక్షణలో పనులు జరుగుతున్నాయి. నందిపేట్ కేదారేశ్వర ఆశ్రమంలో రూ. లక్షల వ్యయంతో నూతన హంగులతో ఎంతో సుందరంగా పిరమిడ్ ఆకారంలో ధ్యాన మందిరాన్ని నిర్మించారు. అందులో ఏసీ (ఎయిర్ కండీషనర్)ను సైతం ఏర్పాటుచేశారు.
పిరమిడ్ ధ్యానాన్ని గ్రామగ్రామాన తీసుకుపోతున్నాం. పీఎస్ఎస్ఎం ద్వారా వందలాది మందితో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటుచేస్తున్నాం. ప్రతి ఆదివారం ఎక్కడో ఒక చోట కార్యక్రమం ఏర్పాటు చేసి చుట్టుపక్కల గ్రామాల ప్రజలను అక్కడికి చేర్చి ధ్యానం చేయించి, ధ్యాన ప్రాధాన్యతను వివరిస్తున్నాం. ధ్యానంతో లాభం కలిగిన వారు వారి అనుభవాలను వేదికలపై చెప్పడంతో ధ్యానానికి ఉన్న శక్తి ప్రజలకు తెలుస్తున్నది. వేలాది మందిని నిత్య ధ్యాన సాధకులుగా మార్చాం. రాబోయే రోజుల్లో ప్రతి గ్రామంలో వాడవాడలా ధ్యాన కేంద్రాలు ఏర్పాటు చేస్తాం.
– బైతి సాయికృష్ణా రెడ్డి, పీఎస్ఎస్ఎం, జిల్లా అధ్యక్షుడు