నిజామాబాద్ క్రైం, డిసెంబర్11 : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో శనివారం రాత్రి జరిగిన పేలుడు సంఘటనను అధికారులు సీరియస్గా పరిగణించారు. రెండో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వైన్స్ షాపు వద్ద భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. దీంతో స్థానికులు భయభ్రాంతులకు గురికావడంతో పోలీస్ బాస్ సంఘటనపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాల్సిందిగా సిబ్బందిని ఆదేశించారు. స్థానికంగా ఉండే శంకర్ గౌడ్ అనే చిత్తుకాగితాలు, ఖాళీ సీసాలు సేకరిస్తూ జీవనం సాగిస్తాడు. ప్రతి రోజు మాదిరిగానే శంకర్ శనివారం రాత్రి ఎక్కడి నుంచో 5 లీటర్ల ప్లాస్టిక్ డబ్బాను తీసుకొని పెద్ద బజార్ ఏరియాలో ఉన్న వైన్స్ షాపు వద్దకు వచ్చాడు. కొద్ది సమయానికి భారీ శబ్దంతో పేలుడు సంభవించింది.
దీంతో చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకున్నారు. పేలుడు ధాటికి పరిసర ప్రాంతంలో భారీగా పొగ వ్యాపించి రోడ్డు పై వెళ్తున్న వారికి ఏం జరిగిందో కనిపించకుండా పోయింది. కొద్ది సమయం తర్వాత చూడగా అక్కడ శంకర్ రక్తపు మడుగులో కొట్టుమిట్టాడడాన్ని గమనించిన స్థానికులు వెంటనే 108 అంబులెన్స్తో పాటు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలిసిన వెంటనే నగర ఇన్చార్జి సీఐ డి.విజయ్ బాబు, రెండో టౌన్ ఎస్సై ఏ.పూర్ణేశ్వర్ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ముందు జాగ్రత చర్యగా ఫైర్ ఇంజిన్ను తెప్పించి సంఘటన స్థలంతో పాటు చుట్టు పక్కల ఏరియా అంతటా వాటర్ కొట్టించారు.
పేలుడు ఘటనను కమిషనర్ ఆఫ్ పోలీస్ కె.ఆర్.నాగరాజు సీరియస్గా పరిగణించారు. దీనిపై పూర్తి స్థాయి విచారణ జరిపి, సమగ్ర నివేదిక ఇవ్వాల్సిందిగా సిబ్బందిని ఆదేశించారు. దీంతో నిజామాబాద్ ఏసీపీ, ఏ.వెంకటేశ్వర్ పర్యవేక్షణలో సీఐ, ఎస్సై దర్యాప్తు ప్రారంభించారు.
చిత్తుకాగితాలు, ఖాళీ బాటిళ్లు సేకరించే శంకర్ ఎక్కడి నుంచో యాసిడ్ బాటిల్ తీసుకువచ్చాడు. దాన్ని తెరిచిన అనంతరం బీడీ వెలిగించడంతో పేలుడు సంభవించింది. సంఘటన పై (అండర్ హెడ్) యూ/హెచ్ ఫైర్ యాక్సిడెంట్ సెక్షన్ కింద కేసు నమోదు చేసి విచారణ నిర్వహిస్తున్నాం. అంతే కాకుండా సంఘటనా స్థలం నుంచి క్లూస్ టీమ్తో ఆధారాలు సేకరించి ఫోరెన్సిక్కు పంపించాం.
చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న శంకర్ గౌడ్ను జూనియర్ సివిల్ జడ్జి గిరిజ విచారించారు. ప్రభుత్వ దవాఖానలో అతని నుంచి మరణ వాంగ్మూలాన్ని రికార్డు చేశారు.
పేలుడు ఘటనపై ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులు సైతం విచారణకు ఆదేశించారు. దీంతో ఆదివారం ఉదయం నిజామాబాద్ ఇంటెలిజెన్స్ సీఐ సాజిద్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సంఘటన స్థలం పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించిన ఆయన చుట్టు పక్కల వారిని విచారించి వివరాలు సేకరించారు. నివేదికను పైఅధికారులకు అందజేయనున్నట్లు తెలిపారు.