వినాయక్నగర్, జనవరి 17 : నిజామాబాద్ నగరానికి చెందిన ఓ యువకుడు మద్యానికి బానిసగా మారి, డబ్బుల కోసం ఏటీఎంలను ధ్వంసం చేస్తున్నాడు. నెలవ్యవధిలో రెండుసార్లు ఏటీఎంలను ధ్వంసం చేసిన నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. ఏసీపీ కార్యాలయంలో సీసీఎస్, నిజామాబాద్ ఇన్చార్జి ఏసీపీ విజయసారథి, నగర సీఐ నరహరి బుధవారం ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. నగరంలోని మిర్చికాంపౌండ్కు చెందిన యువకుడు పడమటి రమేశ్ కూలీ పనిచేస్తాడని తెలిపారు. మద్యానికి బానిసగా మారి, డబ్బుల కోసం డిసెంబర్ 18న రాత్రి అర్సపల్లి వద్ద ఉన్న ఎస్బీఐ ఏటీఎంను ధ్వంసం చేసి, నగదు దొంగిలించడానికి యత్నించాడని వెల్లడించారు. అదే సమయంలో ఏటీఎం సెంటర్లోని అలారం మోగడంతో నిందితుడు అక్కడి నుంచి పారిపోయినట్లు తెలిపారు. ఈనెల 16న గోశాల రోడ్డులో ఉన్న ఎస్బీఐ ఏటీఎం మిషన్ను రాడ్తో ధ్వంసం చేశాడు. అలారం మోగిన వెంటనే పరారయ్యాడని, ఆయా ఏటీఎంల వద్ద ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా నిందితుడిని బుధవారం అరెస్టు చేసి, రిమాండ్కు తరలించినట్లు వివరించారు. ఈ కేసును ఛేదించిన నగర సీఐ నరహరి, వన్టౌన్ ఎస్సై-2 విష్ణుప్రకాశ్, ఏఎస్సై షకీల్, సిబ్బంది గంగారాం, మధును ఇన్చార్జి ఏసీపీ అభినందించారు.
జల్సాలకు అలవాటు పడి బైక్లను చోరీ చేస్తున్న ఇద్దరు నిందితులను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను సీసీఎస్, నిజామాబాద్ ఇన్చార్జి ఏసీపీ విజయసారథి వెల్లడించారు. జిల్లాకేంద్రంలోని చంద్రానగర్కు చెందిన న్యాలకంటి శేఖర్ (ల్యాబ్ టెక్నీషియన్), సీతారాంనగర్ కాలనీకి చెందిన అక్నోర్ సతీశ్ (కార్పెంటర్) కలిసి బైక్లు చోరీలు చేసినట్లు వెల్లడించారు. నిజామాబాద్ వన్టౌన్ పోలీస్స్టేషన్ ఏరియాలో రెండు బైకులు, ఆర్మూర్ పోలీస్స్టేషన్ పరిధిలో రెండు బైక్లను చోరీచేసినట్లు తెలిపారు. చోరీ చేసిన బైక్లను విక్రయించేందుకు వెళ్తూ.. అనుమానాస్పదంగా కనిపించడంతో నగర సీఐ నరహరి ఆధ్వర్యంలో వన్టౌన్ ఎస్సై-2 విష్ణుప్రకాశ్, సిబ్బందితో కలిసి పట్టుకున్నట్లు వివరించారు. నిందితుల నుంచి నాలుగు బైక్లను స్వాధీనం చేసుకొని.. కేసు నమోదు చేసి, రిమాండ్కు తరలించినట్లు వివరించారు.