నిజామాబాద్ లీగల్, డిసెంబర్ 23: న్యాయవాదుల సంక్షేమం, వృత్తిపరమైన ఎదుగుదలకు బార్ కౌన్సిల్ కృషి చేస్తున్నదని తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్ నర్సింహారెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా కోర్టు ప్రాంగణంలోని పీపీ గంగా రెడ్డి మెమోరియల్ హాల్లో శనివారం నిర్వహించిన సెమినార్లో ఆయన నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల న్యాయవాదులనుద్దేశించి ప్రసంగించారు. బార్ కౌన్సిల్ నిరంతర ఆలోచనలకు, ఆచరణకు రూపమిచ్చి న్యాయవాదుల సంక్షేమ పథకాలకు బాటలు వేస్తున్నామని అన్నారు. న్యాయసంబంధిత విషయ పరిజ్ఞానం పెంపొందించుకోవడానికి సెమినార్లు ప్రయోజనకారిగా ఉంటాయన్నారు. బార్ కౌన్సిల్కు ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆర్థిక వనరులు సమీకరించుకొని మరిన్ని ప్రగతి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టుకుంటామని ఆయన తెలిపారు. బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్ సునీల్ గౌడ్, బార్ కౌన్సిల్ సభ్యులు రాజేందర్ రెడ్డి, కొల్లి సత్యనారాయణ, అనంతసేన రెడ్డి, భైరపాక జయకర్, కొండారెడ్డి, కిరణ్ పాలకుర్తి, రామారావు, మధుసూదన్ తమ సందేశాలను వినిపించారు.
బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులు విష్ణువర్ధన్ రెడ్డి ప్రసంగిస్తూ గిరిగీసుకొని ఉండరాదని, న్యాయసంబంధిత విషయ పరిజ్ఞానం సముపార్జించుకోవాలని, నూతన చట్టాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని సూచించారు. నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల మాట్లాడుతూ న్యాయవాదులు నిత్య విద్యార్థులేనని, నిరంతర అధ్యయనమే వృత్తిని వృద్ధి చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దేవదాస్ చాంఢక్, ఉపాధ్యక్షుడు ఆశ నారాయణ, ప్రధాన కార్యదర్శి బాగీ చరణ్, రాష్ట్ర బార్ కౌన్సిల్ కార్యదర్శి నాగలక్ష్మి, న్యాయవాదులు పాల్గొన్నారు.