ఖలీల్వాడి, సెప్టెంబర్ 1 ; పేదలకు వైద్యం భారం కాకూడదనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్.. సర్కారు దవాఖానలపై ప్రత్యేక దృష్టి సారించారు. భారీగా నిధులను మంజూరు చేస్తూ దవాఖాలను కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేశారు. అన్ని రకాల వైద్య పరికరాలు, మౌలిక వసతులతోపాటు ప్రత్యేక వైద్య నిపుణులను నియమించి నాణ్యమైన సేవలు అందిస్తున్నారు. దీంతో ప్రజలకు సర్కారు దవాఖానలపై భరోసా కలిగింది. పల్లె, బస్తీ, మాడ్రన్ దవాఖాలను ఏర్పాటు చేసి సర్కారు వైద్యాన్ని మరింత చేరువ చేశారు. అత్యంత ఖరీదైన మల్టీ స్పెషాలిటీ సేవలను కూడా ప్రభుత్వ దవాఖానలో ఉచితంగా అందిస్తున్నారు. నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ దవాఖానలో ప్రతిరోజూ 1500కు పైగా ఓపీతోపాటు 700 పడకలతో ఇన్పేషంట్లకు నాణ్యమైన చికిత్స అందిస్తున్నారు. జీజీహెచ్కు రోగులు క్యూ కడుతున్న నేపథ్యంలో సేవలను కూడా మరింత విస్తృతం చేస్తున్నారు. ఇందులో భాగంగా కోట్ల రూపాయలతో సీటీ స్కాన్, టిఫా స్కాన్, డయాగ్నోస్టిక్ హబ్, రేడియాలజీ హబ్ తదితర సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చారు. త్వరలోనే ఎంఆర్ఐ, క్యాథ్ ల్యాబ్ సేవలను కూడా ప్రారంభించనున్నారు.
జీజీహెచ్లో ఇటీవల డయాగ్నోస్టిక్ హబ్, రేడియాలాజీ హబ్ ప్రారంభం సందర్భంగా రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించినప్పుడు దవాఖాన అభివృద్ధి, సేవలపై జడ్పీ చైర్మన్ విఠల్రావు, ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్ ప్రతిమారాజ్తో సమీక్షించారు. దవాఖానకు ఎంఆర్ఐ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని ఈ సందర్భంగా కోరగా.. మంత్రి సానుకూలంగా స్పందించారు. ఈ మేరకు జీజీహెచ్ బృందం.. ఎంఆర్ఐ ఏర్పాటుకు సంబంధించిన డాటాను వైద్యారోగ్యశాఖకు పంపించింది. సూమారు. రూ. 7కోట్ల విలువ చేసే ఈ మిషన్ ఏర్పాటు చేస్తే ప్రజలకు ఉచితంగా ఎంఆర్ఐ సేవలు అందనున్నాయి. రోగ నిర్ధారణలో భాగంగా ఎంఆర్ఐ స్కానింగ్ కోసం ప్రైవేటు ల్యాబ్లు రూ. 4 వేల నుంచి రూ. 30 వేల వరకు వసూలు చేస్తున్నాయి.
క్యాథ్ల్యాబ్ ప్రారంభానికి ఏర్పాట్లు పూర్తి..
గుండె సంబంధిత ఆపరేషన్లు చేసేందుకు కార్పొరేట్ దవాఖానల్లో రూ. లక్షల్లో ఫీజు వసూలు చేస్తున్నారు. ఇలాంటి ఖరీదైన వైద్యాన్ని సైతం సామాన్యుడికి అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో నిజామాబాద్ జీజీహెచ్లో క్యాథ్ ల్యాబ్ను ఏర్పాటు చేయనున్నారు. సీఎం కేసీఆర్, మంత్రి ప్రశాంత్రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యేల ప్రత్యేక చొరవతో క్యాథ్ల్యాబ్ సేవలను త్వరలోనే ప్రారంభించనున్నారు. ఇప్పటికే రూ. 8కోట్ల విలువ చేసే పరికరాలను జీజీహెచ్కు తీసుకువచ్చారు. ల్యాబ్ ఏర్పాటుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేయగా, నెల రోజుల్లో గుండె చికిత్సలు ప్రజలకు ఉచితంగా అందనున్నాయి.
నెల రోజుల్లో క్యాథ్ల్యాబ్ సేవలు..
నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ దవాఖానలో రోగులకు మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నాం. గుండెకు సంబంధించిన చికిత్సలు చేసేందుకు క్యాథ్ల్యాబ్ను కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఈ సేవలను నెలరోజుల్లో ప్రారంభిస్తాం. వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు త్వరలోనే ఎంఆర్ఐ మిషన్ కూడా ఏర్పాటు చేయిస్తామన్నారు. ఎంతో ఖరీదైన వైద్య సేవలు ప్రజలకు ఉచితంగా అందనున్నాయి.
-ప్రతిమారాజ్, సూపరింటెండెంట్, నిజామాబాద్ జీజీహెచ్