కోటగిరి, డిసెంబర్ 13: ఆత్మరక్షణ కోసం బాలికలకు కరాటే శిక్షణ ఇప్పించేందుకు రాణీ లక్ష్మీబాయి ఆత్మరక్షణ ప్రశిక్షణ్ పేరుతో స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో సన్నాహాలు చేశారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా – పాఠశాలల్లో నవంబర్ 1 నుంచి శిక్షణా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఒక్కో మండలం నుంచి 4,5 ఉన్నత పాఠశాలలను ఎంపిక చేసి 8 నుంచి పదో తరగతి వరకు బాలికలకు వివిధ అంశాలపై తర్ఫీదు ఇస్తున్నారు. జనవరి 23 వరకు ఈ కరాటే శిక్షణ కొనసాగనున్నది. నిజామాబాద్ జిల్లాలో జడ్పీహెచ్ఎస్, కేజీబీవీ, గురుకుల పాఠశాలలను ఇందుకోసం ఎంపిక చేశారు. మూడు నెలల కాల పరిమితిలో 33 రోజులు శిక్షణ జరిగేలా చర్యలు తీసుకున్నారు. విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఉదయం , సాయంత్రం వేళల్లో గంట పాటు బాలికలకు ఆత్మరక్షణ, శారీరక దృఢత్వం, మానసిక ైస్థెర్యం తదితర విషయాలపై ప్రయోగాత్మకంగా అవగాహన కల్పిస్తున్నారు. కోటగిరి మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్, కేజీబీవీని ఎంపిక చేశారని కోటగిరి హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసరావు తెలిపారు. కరాటే శిక్షణ బాలికల్లో ఆత్మైస్థెర్యాన్ని నింపుతుందని వివరించారు.
అనూహ్య పరిణామాలు ఎదురైనప్పుడు ధైర్యంగా ఎదుర్కొనేందుకు కరాటే ఉపయోగపడుతంది. ఒంటరి వారమన్న భయాన్ని దరి చేరనివ్వదు. ఆపద సమయాల్లో నీడలా వెన్నంటి ఉంటుంది. శ్రద్ధతో సాధన చేస్తే నిర్భయంగా ఉండవచ్చు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని గొప్పగా భావిస్తున్నాం. స్వీయ రక్షణకు ఇది ఉపయుక్తంగా ఉంటుంది.
కరాటే సాధన చేస్తే చేతిలో ఆయుధం ఉన్నట్లే. దాడుల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. ఈ విద్యపై ఇప్పుడిప్పుడే అవగాహన పెంచుకుంటున్నాం. మా కేజీబీవీ ప్రత్యేకాధికారిణి సవిత ప్రోత్సాహంతో మరిన్ని మెళకువలు నేర్చుకుంటున్నాం. ప్రస్తుతం కొన్ని పాఠశాలల్లోనే శిక్షణ ఇస్తున్నారు. అందరికీ అవకాశం కల్పిస్తే బాగుంటుంది.