డిచ్పల్లి, జూలై 18 : గ్రామీణ ప్రాంతాల్లో సోలార్ వినియోగానికి ప్రాధాన్యత పెరుగుతున్నది. దీంతో ప్రజలకు మరింత చేరువ చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇండ్లల్లో సోలార్ యూనిట్లు ఏర్పాటు చేసుకునేలా మహిళా సంఘాలకు చేయూతనిస్తున్నది. స్వయం సహాయక సంఘాల సభ్యులు.. గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా సోలార్ విద్యుత్ యూనిట్లు ఏర్పాటు చేసుకునేలా స్త్రీనిధి, రెడ్కో సంస్థలు ప్రోత్సహిస్తున్నాయి. ఈ మేరకు లబ్ధిదారులను గుర్తించి వారికి రుణ సౌకర్యం కల్పించేలా సెర్ఫ్ అధికారులు కార్యాచరణ చేపట్టారు.
2కిలోవాట్స్ యూనిట్ కెపాసిటీకి ప్రాజెక్టు విలువ రూ.1,42,200 ఉండగా ఇందులో సబ్సిడీ రూ.39,200, దరఖాస్తు చార్జీలు 2,360, నెట్ మీటర్ చార్జీలు రూ.2,950, మహిళా సభ్యురాలు చెల్లించాల్సిన మొత్తం రూ.1,03,000, స్త్రీ నిధి రుణం రూ.1,00,000 ఉండగా సభ్యురాలి వాటా రూ.3000, నెలవారీ ఈఎంఐ రూ.2243 ఉంటుంది. 3కిలోవాట్స్ యూనిట్ కెపాసిటీకి ప్రాజెక్టు విలువ రూ.1,92,360 ఉండగా ఇందులో సబ్సిడీ రూ.57,360, దరఖాస్తు చార్జీలు 3,450, నెట్ మీటర్ చార్జీలు రూ.2950, మహిళా సభ్యురాలు చెల్లించాల్సిన మొత్తం రూ.1,35,000, స్త్రీ నిధి రుణం రూ.1,25,000 ఉండగా సభ్యురాలి వాటా రూ.10000, నెలవారీ ఈఎంఐ రూ.2803 ఉం టుంది. సౌర విద్యుత్ యూనిట్ పూర్తిస్థాయిలో అమర్చిన తర్వాత టీఎస్ రెడ్కో అధికారులు, స్త్రీనిధి సిబ్బంది తనిఖీ చేసిన అనంతరం స్వయం సహాయక సంఘం సభ్యురాలి సంతృప్తి మేరకు ఇన్స్టాలేషన్ సర్టిఫికెట్ను జారీ చేస్తారు. అనంతరం రుణ మొత్తాన్ని స్త్రీనిధి నుంచి సభ్యురాలి సేవింగ్స్ ఖాతాలో జమ చేస్తారు. అనంతరం సభ్యురాలు డబ్బులను వెండర్కు చెల్లించాల్సి ఉంటుంది. టీఎస్రెడ్కో సబ్సిడీ మొత్తాన్ని వెండర్కు రిలీజ్ చేస్తుంది. వడ్డీ 11శాతం ఉండగా, 60 నెలల్లో రుణాన్ని తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.
ఆసక్తి ఉన్న మహిళా సభ్యులకు ప్రత్యేకంగా స్త్రీనిధి ద్వారా రుణాలు అందిస్తుండగా, రాయితీ కూడా కల్పిస్తున్నారు. ఆసక్తి ఉన్న మహిళా సభ్యురాలికి 2 లేదా 3 కిలోవాట్స్ సామర్థ్యం కలిగిన సౌర విద్యుత్ పలకలను రాయితీపై మంజూరు చేసి ఇంటిపై ఏర్పాటు చేస్తారు. 2కిలోవాట్స్ యూనిట్లు రోజుకు 8 యూనిట్లు, 3కిలోవాట్స్ యూనిట్లు రోజుకు 12 యూనిట్ల విద్యుత్ను ఉత్పత్తి చేస్తాయి. ప్రతి నెలా వారు వినియోగించుకునే విద్యుత్ పోను అవసరానికన్నా ఎక్కువ ఉత్పత్తి అయితే దానిని గ్రిడ్కు అనుసంధానించనున్నారు. సౌర విద్యుత్ యూనిట్ ఏర్పాటు చేసిన అనంతరం టీఎస్రెడ్కో సూచించిన జాగ్రత్తలను నిర్వాహకులు విధిగా పాటించాల్సి ఉంటుంది. సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసేందుకు 160-200 చదరపు అడుగుల డాబా ఉండాలి.
జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో 27 మండల సమాఖ్యలు,806 గ్రామ సమాఖ్య సంఘాలున్నాయి. వీటి పరిధిలో 23777 స్వయం సహాయక మహిళా సంఘాలు పని చేస్తున్నాయి. ఇందులో 2 లక్షల 50వేల 489 మంది సభ్యులు ఉన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో సోలార్ వినియోగానికి ప్రాధాన్యత ఇ చ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది.. ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీని పొందాలి. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా మహిళా సంఘాలకు సోలార్ యూనిట్ల ఏర్పాటుపై అవగాహన కార్యక్రమాలు చేపట్టారు.
-బదావత్ చందర్నాయక్, జిల్లా గ్రామీణభివృద్ధి అధికారి