భీమ్గల్, ఫిబ్రవరి 23: బంజారాల సంక్షేమానికి కేసీఆర్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. మన రాష్ట్రంలో గిరిజనుల అభివృద్ధి కోసం అమలవుతు న్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు బంజారాల జనాభా అధికంగా ఉన్న రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, ఛత్తీస్గడ్ వంటి రాష్ర్టాల్లో సైతం కానరావని తెలిపారు. భీమ్గల్లో సేవాలాల్ మహరాజ్ జయంతిని గురువారం అధికారికంగా నిర్వహించగా.. కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతుతో కలిసి మంత్రి వేముల పాల్గొన్నారు. రూ.50లక్షల నిధులతో నిర్మించిన బంజారా భవన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ అడవి బిడ్డలైన బంజారాల కష్టాలు తెలిసిన వ్యక్తిగా సీఎం కేసీఆర్ వారి అభ్యున్నతి కోసం అనేక పథకాలను అమలుచేస్తున్నారని తెలిపారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు కేవలం 700 తండాలు మాత్రమే జీపీలుగా ఉండేవని గుర్తుచేశారు. గిరిజనులకు పాలనాధికారం కల్పించాలనే లక్ష్యంతో 500 జనాభా కలిగిన ప్రతి తండాకు గ్రామపంచాయతీ హోదా కల్పించడంతో రాష్ట్రంలో ప్రస్తుతం కొత్త గా 2400 తండాలు జీపీలుగా అవతరించాయని వివరించారు. గిరిజన బిడ్డలకు ఆధునాతన సదుపాయాలతో కూ డిన నాణ్యమైన విద్యా బోధన అందాలనే ఉద్దేశంతో కొత్తగా 300 వరకు ఎస్టీ రెసిడెన్సియల్ స్కూల్స్, ఆశ్రమ పాఠశాలలు, వసతిగృహాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు.
సీఎం కేసీఆర్ సహకారంతో బాల్కొండ నియోజకవర్గంలో ప్రతి తండాకు సీసీ రోడ్డు ఏర్పాటు చేయించగలిగానని, ప్రస్తుతం వాటిని బీటీ రోడ్డుగా తీర్చిదిద్దుతామన్నారు. కేసీఆర్ చొరవతోనే దశాబ్దాల కాలం నుంచి పెండింగ్లో ఉంటూ వచ్చిన మానాల-మర్రిమడ్ల, దేవక్కపేట-కారేపల్లి రోడ్లకు అటవీశాఖ అనుమతులు సాధించి ప్రస్తుతం పనుల్లో వేగం పెంచినట్లు తెలిపారు. భీమ్గల్లోని కస్తూర్బా పాఠశాలలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని కలెక్టర్కు మంత్రి వేముల సూచించారు. భీమ్గల్లో గిరిజన రెసిడెన్షియల్ పాఠశాల ఏర్పాటుకు కృషి చేస్తానని హామీనిచ్చారు. అనంతరం దివంగత వేముల సురేందర్రెడ్డి స్మారక క్రికెట్ టోర్నీలో గెలుపొందిన జట్లకు ట్రోఫీలతో పాటు నగదు పారితోషికాలను మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కన్నె ప్రేమలతా సురేందర్, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ మంజుల, ఎంపీపీ మహేశ్, జడ్పీటీసీ రవి, జడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు మొయీజ్, బాల్కొండ నియోజకవర్గ ప్రత్యేకాధికారి సింహాచలం, జిల్లా గిరిజన సంక్షేమాధికారి నాగూరావు, ఆర్మూర్ ఆర్డీవో శ్రీనివాసులు, బంజారా సేవా సంఘం ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ తండాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన గిరిజనులు పాల్గొన్నారు.