బోధన్, జూలై 7: వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో నిజామాబాద్ నగర ప్రజల తాగునీటి అవసరాల కోసం గోదావరి జలాలు అలీసాగర్ ఎత్తిపోతల పథకం ద్వారా తరలివెళ్తున్నాయి. ఈ ఎత్తిపోతల పథకం సాగునీటితో పాటు తాగునీటి అవసరాలను తీరుస్తుండడం.. ఈ ఎత్తిపోతలు ప్రాధాన్యతను సంతరించుకున్నది. కాళేశ్వరం జలాలు రివర్స్ పంపింగ్తో వరదకాలువ ద్వారా శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు చేరుకుంటుండడంతో అలీసాగర్ ఎత్తిపోతల పథకం జీవం పోసుకోనున్నది. గోదావరి నదిలో నీటి ప్రవాహం తగ్గడంతోపాటు కొన్ని రోజులుగా వర్షాలు లేకపోయినప్పటికీ, కాళేశ్వరం జలాలు తరలివస్తుండడంతో అలీసాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కు ఏమాత్రం ఢోకాలేదని చెప్పవచ్చు. కాళేశ్వరం జలాలు వరదకాల్వ ద్వారా శ్రీరాంసాగర్ చెంతకు చేరడం, ముప్కాల్ పంప్హౌస్ ద్వారా శ్రీరాంసాగర్కు ఆ జలాలను ఎత్తిపోయడం శుక్రవారం సాయంత్రం నుంచి ప్రారంభమైంది. దీంతో శ్రీరాంసాగర్కు ఎగువన గోదావరి నదిపై నవీపేట్ మండలం కోస్లీ వద్ద నిర్మించిన ఈ ఎత్తిపోతలకు గోదావరి జలాలను వాడుకునే అవకాశం ఏర్పడింది.
కాళేశ్వరం జలాలే లేకపోయినట్లయితే, శ్రీరాంసాగర్ ఆయకట్టు అవసరాలరీత్యా గోదావరి జలాలను అలీసాగర్ ఎత్తిపోతల పథకం ఉపయోగించుకునేందుకు అనుమతి ఉండేది కాదు. వాస్తవానికి ప్రస్తుతం శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో కేవలం 20 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ఇందులో వినియోగించుకునే జలాలు ఐదు టీఎంసీలు మాత్రమే.. మిగతా 15 టీఎంసీల నీరు డెడ్స్టోరేజీగా ఉండేది. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లో నీరు లేకపోవడంతో ఎగువ నుంచి గోదావరిలో ఏ మాత్రం నీటి ప్రవాహం ఉన్నా.. ఆ నీరంతా శ్రీరాంసాగర్కు వెళ్లాల్సి ఉంటుంది. కాగా, సీఎం కేసీఆర్ చారిత్రాత్మక నిర్ణయంతో కాళేశ్వరం జలాలు శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్కు తరలివస్తుండడంతో.. అలీసాగర్ ఎత్తిపోతల పథకానికి నీటిగండం తప్పినట్లయ్యింది. రానున్న 60 రోజులపాటు రోజుకు 0.5 టీఎంసీల చొప్పున శ్రీరాంసాగర్ రిజర్వాయర్ను కాళేశ్వరం జలాలతో నింపనున్నారు. కాళేశ్వరం జలాలతో శ్రీరాంసాగర్ ఏమాత్రం నిండినా.. ఆ మేరకు గోదావరిలో శ్రీరాంసాగర్ బ్యాక్వాటర్ పెరుగుతుంది. నవీపేట్ మండలం కోస్లీ వరకు ఈ బ్యాక్ వాటర్ ఉంటుందని భావిస్తున్నారు.
కాళేళ్వరం జలాలకు తోడుగా ఓ మోస్తారు వర్షాలు కురిసి గోదావరికి ఎగువ నుంచి నీటి ప్రవాహం పెరిగినట్లయితే.. అలీసాగర్ ఎత్తిపోతల పథకం ద్వారా రైతులకు పుష్కలంగా సాగునీటిని అందించవచ్చు. కాళేళ్వరం జలాలతో గుత్ప ఎత్తిపోతల పథకంతో పాటు జిల్లాలోని సుమారు 20 ఎత్తిప్తోతల పథకాలకు ఢోకా ఉండదని నీటిపారుదలశాఖ ఇంజినీర్లు అంటున్నారు. కాళేశ్వరం నుంచి ఎదురెక్కిన జలాలు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టుతో పాటు నిజాంసాగర్ ఆయకట్టును కూడా సస్యశ్యామలం చేయనున్నాయి.
అలీసాగర్ ఎత్తిపోతల పథకం కింద 53,793 ఎకరాల ఆయకట్టు, గుత్ప ఎత్తిపోతల పథకం కింద 38,792 ఎకరాల ఆయకట్టు ఉంది. వాస్తవానికి, ఈ రెండు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ల ఆయకట్టు నిజాంసాగర్ ఆయకట్టు కిందకే వస్తుంది. ఈ రెండు ఎత్తిపోతల పథకాల నిర్మాణంతో నిజాంసాగర్ నీటిని ప్రస్తుతం నిజాంసాగర్ ప్రధాన కాల్వలో అలీసాగర్ వరకు.. అంటే నిజాంసాగర్ ప్రధాన కాల్వ 50వ నంబర్ డిస్ట్రిబ్యూటరీ వరకు మాత్రమే అందిస్తున్నారు. కాళేశ్వరం జలాలు తరలివస్తుండడంతో శ్రీరాంసాగర్ ఆయకట్టు రైతులే కాకుండా నిజాంసాగర్ ఆయకట్టు రైతులు కూడా సంబురపడుతున్నారు. గోదావరి తీరంవెంబడి బోధన్ డివిజన్లో ఉన్న వ్యవసాయ బోరుబావుల్లో భూ గర్భజలాల మట్టాలు గణనీయంగా పెరుగుతాయని రైతులు అంటున్నారు. శుక్రవారం గుత్ప ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీటిని విడుదల చేశారు. అలీసాగర్ ఎత్తిపోతల నుంచి ప్రస్తుతం నిజామాబాద్ నగరం తాగునీటి అవసరాల కోసం మాత్రమే నీటిని తరలిస్తున్నారు. అయితే, ఈ ఎత్తిపోతల పథకం నుంచి త్వరలోనే సాగునీటి అవసరాల కోసం నీటిని విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
నిజామాబాద్కు 100 ఎంసీఎఫ్టీల తాగునీరు..
వర్షాభావంతో నిజామాబాద్ నగరానికి భవిష్యత్తులో ఏమాత్రం ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. నిజామాబాద్ నగరానికి తాగునీటి అవసరాలను మంచిప్ప, మాసాని చెరువులతో పాటు అలీసాగర్ రిజర్వాయర్ తీర్చుతున్నాయి. నిజామాబాద్లో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా తాగునీటి సరఫరా చేస్తుండడంతో మాసాని, మంచిప్ప చెరువుల్లో నీటి మట్టాలు తగ్గాయి. అలీసాగర్ రిజర్వాయర్లో కూడా కొద్ది రోజులకు సరిపడా నీరు ఉంది. తాగునీటికి ఉన్న ప్రాధాన్యతరీత్యా గోదావరి నుంచి అలీసాగర్ ఎత్తిపోతల పథకం ద్వారా జలాలను నిజామాబాద్కు తరలించాలని కలెక్టర్ నిర్ణయించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ నెల 5న శుక్రవారం నుంచి రెండు మోటర్ల ద్వారా అలీసాగర్ ఎత్తిపోతల నుంచి నీటిని విడుదల చేశారు. ఈ నీరు ముందుగా అలీసాగర్ జలాశయం వద్దకు చేరుకుంటుంది. అక్కడి నుంచి నిజామాబాద్ కార్పొరేషన్ నిర్వహిస్తున్న అలీసాగర్ వాటర్ వర్క్స్ పైపులైన్ల ద్వారా నిజామాబాద్ నగరానికి తరలిస్తున్నారు. మరో నాలుగైదు రోజులపాటు ఈ జలాల తరలింపు జరుగుతుందని, రానున్న రెండు నెలల తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిజామాబాద్కు 100 ఎంసీఎఫ్టీల మేరకు తాగునీరు తరలిస్తున్నామని ఇరిగేషన్ ఇంజినీర్లు తెలిపారు.