సిరికొండ, ఫిబ్రవరి 2 : మండలంలోని తూంపల్లి గ్రామంలోని ఎదురుకొండ శ్రీలక్ష్మీవేంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామి వారి కల్యాణాన్ని గురువారం వైభవంగా నిర్వహించారు. వేద పండితుల ఆధ్వర్యంలో యజ్ఞం, హోమం, ప్రత్యేక పూజలతో పాటు కల్యాణ వేడుకలను వైభవంగా నిర్వహించారు. కల్యాణాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సాయంత్రం వేలాది మంది భక్తుల సమక్షంలో రథోత్సవాన్ని నిర్వహించారు. స్వామివారికి ముడుపులు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. స్వామివారిని ధర్పల్లి జడ్పీటీసీ, జిల్లా ఒలింపిక్ సంఘం ఉపాధ్యక్షులుడు బాజిరెడ్డి జగన్, జడ్పీటీసీ సభ్యుడు మాన్సింగ్, నాయకులు ఆకుల తిర్మల్ దర్శించుకున్నారు. కార్యక్రమంలో సర్పంచులు బాలమణీ మల్లేశ్, శంకర్లాల్, సంగ్లూ, ఆలయ కమిటీ చైర్మన్ మహిపాల్రెడ్డి, మోజీలాల్, లక్ష్మణ్ గౌడ్, పెద్ద నర్సయ్య, సాయిలు, సంతోష్, వీడీసీ సభ్యులు పాల్గొన్నారు.
జక్రాన్పల్లి, ఫిబ్రవరి 2 : మండలంలోని కొలిప్యాక్ గ్రామంలో ఉన్న ఆనందగిరి లక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి. ఉదయం బ్రహ్మోత్సవ సంకల్పం, దీపారాధన, స్వస్తి పుణ్యాహవాచనం, సర్వదేవ ఆహ్వానం, హోమం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఉత్తరాది మఠాధీశులైన శ్రీ 1008 శ్రీ సత్యాత్మ తీర్థ శ్రీ పాదుల వారి ఆదేశానుసారం ఈనెల 7వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. 3న గరుడ ధ్వజారోహణం, 4న పాత్రరూపాసనం, కల్యాణ మహోత్సవం, 5న రథోత్సవం (జాతర), 6న పూర్ణాహుతి, చక్రతీర్థం, 7న డోలాసేవ, ఉత్సవసమాప్తి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో సర్పంచ్ బాలయ్య, ఎంపీటీసీ సభ్యుడు ఢీకొండ శ్రీనివాస్, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, వివిధ గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.