కామారెడ్డి జిల్లాలో రోజురోజుకూ భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. వేసవికాలం కావడంతో నీటి వనరులు వేగంగా పడిపోతున్నాయి. పదేండ్ల కాలంలో ఇలాంటి పరిస్థితిని ఎన్నడూ చూడలేదని మండలంలోని సోమార్పేట్ రైతులు వాపోతున్నారు. గ్రామంలో రైతుల పంట పొలాలు సాగునీరు లేక ఎండిపోతున్నాయి. ఎన్నడూలేని విధంగా భూగర్భ జలాలు అడుగంటడం రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. కనీసం పెట్టుబడి వచ్చే పరిస్థితి కూడా లేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఈ వేసవిలో రెండెకరాలు ఉంటే ఎకరం, మూడెకరాలుంటే ఎకరంన్నర, నాలుగెకరాలు ఉంటే రెండెకరాల్లో మాత్రమే పంటలు వేశారు. ఉన్న పొలంలో సగం పంటలు వేస్తే అవికూడా నీళ్లులేక ఎండిపోతున్నాయని వాపోతున్నారు.
-మాచారెడ్డి, మార్చి 29
నాకు ఎకరం 20 గుంటల భూమి ఉన్నది. ఎకరం విస్తీర్ణంలో వరి పంట వేసిన. మొదట్లో మంచిగానే నీళ్లచ్చినయి. తర్వాత బోరు పారకపోవడంతో పంట పూర్తిగా ఎండిపోయింది. సుమారు రూ.15 వేల వరకు పంట పెట్టుబడి పెట్టిన. పంట పూర్తిగా ఎండిపోవడంతో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నాం. గతంలో ఎన్నడూ ఇలా కాలేదు. వ్యవసాయం మీదనే అధారపడి జీవిస్తున్నాం.
-కట్కూరి నాగరాజు, సోమార్పేట
నాకున్న రెండెకరాల భూమిలో ఒక బోరు మోటరు ఉన్నది. ఎకరమున్నర పొలంలో వరి పంట వేసిన. పంటకు సరిపడా నీళ్లు అందక పూర్తిగా ఎండిపోయింది. బోర్లల్లో నీళ్లు లేక మోటర్ నడిపించే సరికి మోటర్ కూడా కాలిపోయింది. రూ.12 వేలు పెట్టి చేయించినానీళ్లు రావడం లేదు. చేసేదిలేక ఎండిన పొలంలో పశువులను మేపుతున్న. పంట పెట్టుబడి కోసం రూ.15 వేలు అప్పు చేసిన. మా గ్రామంలో రైతులందరి పరిస్థితి ఇలాగే ఉన్నది. భూమిని నమ్ముకొని బతికే రైతులకు ఇలాంటి కష్టం వస్తే ఎలా ముందుకెళ్లేది.
– లాల్, సోమార్పేట, మాచారెడ్డి మండలం
నాకు నాలుగెకరాల భూమి ఉన్నది. ఒకటిన్నర ఎకరంలో వరి వేశాను. పంటకు నీళ్లు కావాల్సిన సమయంలో కరెంట్ లేక పూర్తిగా ఎండిపోయింది. రెండు బోర్లలో నీళ్లు ఇంకిపోవడంతో దాదాపు రూ.10 వేలు పెట్టి క్రషింగ్ చేయించినా ఫలితం దక్కలేదు. ఇప్పటి వరకు దాదాపు రూ. 20 వేలు వరకు పెట్టుబడి పెట్టిన. రైతుబంధు కూడా ఇంకా రాలేదు.
-బానోత్ లాల్, సోమార్పేట