కమ్మర్పల్లి, ఫిబ్రవరి 15: బాల్కొండ నియోజకవర్గంలో న్యాక్ ద్వారా మంజూరు చేయించిన నైపుణ్య శిక్షణా కేంద్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేయడం సబబు కాదని బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. గురువారం శాసనసభ సమావేశంలో అప్రోప్రియేషన్ బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. నిజామాబాద్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాల నుంచి నిరుద్యోగ యువత ఉపాధి కోసం పెద్ద ఎత్తున గల్ఫ్ దేశాలకు వెళ్తారని గుర్తుచేశారు.
బాల్కొండ నుంచి 18వేల మంది గల్ఫ్ దేశాల్లో ఉంటారన్నారు. గల్ఫ్ వెళ్లే నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణనందిస్తే మంచి వేతనాలు, ఉద్యోగాలు లభిస్తాయన్న ఆశయంతో అప్పటి ఆర్అండ్బీ శాఖ మంత్రిగా న్యాక్ శిక్షణ కేంద్రాన్ని తాను మంజూరు చేయించానన్నారు. శిక్షణ కేంద్ర భవన నిర్మాణం ప్రారంభించుకునే సమయంలో కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సెంటర్ను రద్దు చేయడం నిరుద్యోగ యువతకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందని ఎమ్మెల్యే ప్రశాంత్రెడ్డి సభలో వివరించారు. ప్రస్తుత మంత్రి ఆలోచించి మంజూరైన శిక్షణ కేంద్రాన్ని యథావిధిగా కొనసాగించాలని విన్నవించారు.