డిచ్పల్లి, మార్చి 16 : రాజ్యాంగం కల్పించిన హక్కులు, రిజర్వేషన్లను మహిళలు సద్వినియోగం చేసుకొని ముందుకు సాగాలని నిజామాబాద్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ పి.పద్మావతి అన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలోని కామర్స్ విభాగంలో వర్సిటీ ఉమెన్ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ అపర్ణ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె ప్రత్యేక అతిథిగా హాజరై నిజామాబాద్ డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ అంజనతో కలిసి జ్యోతిప్రజ్వలన చేశారు.
ఈ సందర్భంగా పి.పద్మావతి మాట్లాడుతూ.. ప్రపంచ మహిళా దినోత్సవాన్ని గతంలో ఎప్పుడూలేని విధంగా ఈ ఏడాది పెద్ద ఎత్తున జరుపుకోవడం, ఒకేరోజు కాకుండా మహిళల గౌరవార్థం నెలరోజుల పాటు వివిధ కార్యక్రమాలను నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు. మహిళలు చదువుకున్నప్పుడే ఇల్లు, సొసైటీ బాగుపడుతుందని అన్నారు. డిప్యూటీ డీఎంహెచ్వో అంజన మాట్లాడుతూ.. ప్రస్తుత సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని అన్నారు.
మహిళలు చాలా మంది క్యాన్సర్ వ్యాధి బారిన పడుతున్నారని, ముందస్తుగా గుర్తించి తగిన చికిత్స చేయించుకోవాలని సూచించారు. వీసీ ప్రొఫెసర్ రవీందర్ మాట్లాడుతూ.. ప్రస్తుత రాజకీయాల్లో, అన్ని రంగాల్లో మహిళలు రాణించాలన్నారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తూ ముందువరుసలో నిలిచారన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ విద్యావర్ధిని, ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఆరతి, అధ్యాపకులు సీవోఈ ప్రొఫెసర్ అరుణ, లావణ్య, త్రివేణి, జవేరియా, విద్యార్థినులు పాల్గొన్నారు.