నమస్తే తెలంగాణ యంత్రాంగం ; ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సంక్రాంతి పండుగను ప్రజలు వైభవంగా నిర్వహించారు. మూడు రోజులపాటు సంక్రాంతి సందడితో పల్లెల్లో సందడి వాతావరణం నెలకొన్నది. హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు, డీజే చప్పుళ్లతో గ్రామీణ ప్రాంతాలతోపాటు పట్టణాల్లో పండుగ శోభ కనిపించింది. మహిళలు, యువతులు వేసిన రంగురంగుల ముగ్గులతో వాకిళ్లన్నీ మెరిసిపోయాయి. చిన్నా, పెద్ద తేడా లేకుండా యువకులు, చిన్నారులు పతంగులు ఎగురవేశారు.
సంక్రాంతి పండుగను జిల్లావ్యాప్తంగా ప్రజలు మూడు రోజులపాటు ఘనంగా నిర్వహించుకున్నారు. భోగి, సంక్రాంతి, కనుమ వేడుకల్లో చిన్నాపెద్ద, ఆడామగ అందరూ పాల్గొన్నారు. యువతులు, మహిళలు ముగ్గులు వేసి వాకిళ్లను అందంగా తీర్చిదిద్దారు. నోములు నోచుకున్నారు. చిన్నారులకు బోగి పండ్లు పోశారు. భోగి సందర్భంగా పండివంటలు, సంక్రాంతి, కనుమను పురస్కరించుకొని మాంసాహారం తయారు చేసుకొని భుజించారు. యువకులు డాబాలపై డీజే సిస్టంను పెట్టుకొని గాలి పటాలు ఎగురవేస్తూ ఆనందంగా గడిపారు. పలు గ్రామాల్లో చిన్నారులకు గాలి పటాల పోటీలు, మహిళలకు ముగ్గుల పోటీలను నిర్వహించి బహుమతులను ప్రదానం చేశారు. ఎక్కడెక్కడో ఉన్న వారందరూ ఇండ్లకు చేరుకోవడంతో గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొన్నది.
బీర్కూర్ మండలంలోని రైతునగర్లో సోమవారం జన్మభూమి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబురాల్లో బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, ముగ్గులను ఆయన తిలకించారు. అనంతరం పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. డోంగ్లీలోని శశాంక్ పాటిల్ వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించిన సంక్రాంతి సంబురాల్లో జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్షిండేతోపాటు శశాంక్పాటిల్, ఆనంద్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు.మద్నూర్ మండలంలోని లచ్చన్ గ్రామంలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే షిండే ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.