బోధన్, జనవరి 9: బోధన్ పట్టణం రాకాసీపేట్లోని ఇందూర్ ప్రైమరీ స్కూల్లో సంక్రాంతి సంబురాలను సోమవారం కన్నులపండువగా నిర్వహించారు. సంక్రాంతి సంబురాల్లో భాగంగా పాఠశాల ప్రాంగణమంతా సంక్రాంతి సంస్కృతికి అద్దంపడుతూ గ్రామీణ వాతావరణాన్ని తలపించింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బోధన్ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ సతీమణి ఆయేషా ఫాతిమా, విశిష్ట అతిథిగా బోధన్ మున్సిపల్ చైర్పర్సన్ తూము పద్మాశరత్రెడ్డి, ఆత్మీయ అతిథిగా ఏఎంసీ చైర్మన్ వెంకటేశ్వరరావు దేశాయ్ హాజరయ్యారు. చిన్నారుల వేషధారణలు, రూపకల్పనలు, ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ముందుగా అతిథులు భోగి మంటలను అంటించి సంక్రాంతి సంబురాలను ప్రారంభించారు. చిన్నారులు ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు, చిన్నారులకు భోగి పండ్లను అతిథులు పోయడం, రంగవల్లులు, గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబింబించేలా బండి చక్రాలు, పశువుల పాకాలు, ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఆయేషా ఫాతిమా.. మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సంస్కృతీ సంప్రదాయాలను కండ్లకు కట్టినట్లు చూపించారన్నారు. కార్యక్రమంలో ఇందూర్ హైస్కూల్ కరస్పాండెంట్ కొడాలి కిశోర్, ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు సుధారాణి, హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు కొసరాజు రామారావు తదితరులు పాల్గొన్నారు.