బాన్సువాడ, జూన్ 16: రాష్ట్రంలోని పేదలకు మెరుగైన వైద్యసేవలు అందించాలనే సంకల్పంతో కేసీఆర్ ప్రభుత్వం వైద్యరంగానికి అధిక ప్రాధాన్యం ఇచ్చిందని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా మాతాశిశు దవాఖానలను ఏర్పాటు చేసిందన్నారు. బాన్సువాడలో రూ. 20 కోట్లతో ఎంసీహెచ్ నిర్మించినట్లు తెలిపారు. ఆధునిక హంగులతో వైద్య పరికరాలను ఏర్పాటు చేసి, పేదలకు నాణ్యమైన వైద్యం అందించేలా కృషి చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ దవాఖానల్లో అందజేస్తున్న కేసీఆర్ కిట్ ద్వారా డెలివరీల సంఖ్య పెరిగిందని తెలిపారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం బాన్సువాడ పట్టణంలోని ప్రొఫెసర్ జయశంకర్ మినీ స్టేడియంలో పట్టణ ప్రగతి దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్పీకర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మున్సిపల్ పాలకవర్గం, అధికారులతో కలిసి పట్టణ ప్రగతి కరదీపికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం మాట్లాడుతూ.. ప్రభుత్వం నిర్వహిస్తున్న దశాబ్ది ఉత్సవాలు ఏ ఒక్క జాతి, కులం కోసమో కాదని, ఇది రాష్ట్ర ప్రజల పండుగ అని పేర్కొన్నారు. తొమ్మిదేండ్ల కాలంలో పట్టణంలో జరిగిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించేందుకే పట్టణ ప్రగతి ఉత్సవం అని తెలిపారు. తాను 1998లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బాన్సువాడ దవాఖానలో డెలివరీ చేయడానికి ఓ చిన్నగది ఉండేదని తెలిపారు. స్వరాష్ట్రంలో కేసీఆర్ కిట్ను అందిస్తుండడంతో సర్కారు దవాఖానలకు వస్తున్నారని తెలిపారు. గతంలో నెలకు 60 నుంచి 70 డెలివరీలు కాగా..ప్రస్తుతం బాన్సువాడ మాతాశిశు దవాఖానలో 400 నుంచి 500 వరకు జరుగుతున్నాయని వివరించారు. అమ్మఒడి పథకం దేశంలో ఎక్కడా లేదన్నారు.
బాన్సువాడ పట్టణంలో వచ్చే 50 ఏండ్ల వరకు తాగునీటి ఇబ్బందులు ఉండవన్నారు. అమృత్ 2.0 పథకంలో భాగంగా రూ. 52 కోట్లతో 18 లక్షల లీటర్ల నీటి ట్యాంకును నిర్మించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బాన్సువాడ పట్టణాన్ని కోట్లాది రూపాయలతో అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామన్నారు. పట్టణంలోని కొయ్యగుట్టలో 14 ఎకరాల స్థలంలో రూ.18 కోట్లతో ఆటోనగర్ ఏర్పాటు చేస్తున్నామని, ఇప్పటికే పనులు ప్రారంభమైనట్లు చెప్పారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు కాలనీల్లో సీసీ రోడ్లు, సైడ్ డ్రైనేజీలు నిర్మించామన్నారు. కమ్యూనిటీ హాళ్లు, జనరల్ ఫంక్షన్ హాళ్లను నిర్మిస్తున్నట్లు తెలిపారు. రూ.2కోట్లతో ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్వెజ్ మార్కెట్ను నిర్మిస్తున్నామని, రూ.4కోట్లతో కల్కి చెరువు వద్ద చిల్డ్రన్స్, ఉమెన్స్ పార్కులను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్మికులు, సిబ్బందిని సన్మానించారు. అనంతరం వారితో కలిసి స్పీకర్ పోచారం సహపంక్తి భోజనం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, వైస్చైర్మన్ షేక్ జుబేర్, ఆర్డీవో రాజాగౌడ్, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ అంజిరెడ్డి, పీఆర్ సీసీ సమత, విండో చైర్మన్ ఏర్వాల కృష్ణారెడ్డి, మున్సిపల్ కమిషనర్ కళ్యాణం రమేశ్, ఏఎంసీ వైస్చైర్మన్ బుల్లెట్ రాజశేఖర్ , కౌన్సిలర్లు వెంకటేశ్, రవీందర్రెడ్డి, నందకిశోర్, అమేర్, నేమా సుల్తానా హకీం, రమాదేవి, గైక్వాడ్ రుక్మిణి, మోతీరామ్ , శ్రీనివాస్, కిరణ్, సరిత, తారా, రఫీ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.