బీర్కూర్, జనవరి 23: తెలంగాణ ఏర్పడిన తర్వాత గురుకులాలకు మహర్దశ వచ్చింది. ప్రతి మండలంలో గురుకుల పాఠశాల ఏర్పాటుతో పేద విద్యార్థికి విద్యతోపాటు సన్నబియ్యంతో కూడిన రుచికరమైన భోజనం లభిస్తుంది. దీంతో చదువుతోపాటు ఆటలపై దృష్టిసారించి జాతీయ స్థాయిలో రాణించేలా గురుకులాలు తోడ్పాటునిస్తు న్నాయి. ఇందులో భాగంగా కామారెడ్డి జిల్లా బీర్కూ ర్ మండలకేంద్రంలోని గురుకుల పాఠశాలలో 536 మంది విద్యార్థులు ఉండగా వీరంతా చుట్టుపక్కల మండలాలు, గ్రామీణ ప్రాంత వ్యవసాయ కుటుంబాలకు చెందినవారే. ఈ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు జాతీయస్థాయి క్రీడల్లో ప్రతిభ చాటుతున్నారు. నవంబర్ 26న భద్రా చలంలో నిర్వహించిన జాతీయస్థాయి క్రీడాపోటీల్లో పాఠశాల విద్యార్థులు పాల్గొని పతకాలు సాధించారు. ఇదే క్రమంలో 2021లో బోధన్లో నిర్వహించిన ఉమ్మడి జిల్లాస్థాయి బీసీ గురుకుల క్రీడా పోటీల్లో పతకాలతో మెరిశారు. అదే సంవత్సరం అక్టోబర్ 19 నుంచి 22 వరకు నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లోనూ గురుకుల విద్యార్థులు ప్రతిభ చాటారు. ప్రిన్సిపాల్ మాధవి, పీఈటీ దేవీదాస్, ఇతర సిబ్బంది ప్రోత్సాహంతో నిత్యం శిక్షణ పొందుతూ క్రీడా పోటీల్లో విద్యార్థులు సత్తా చాటుతున్నారు.
జాతీయస్థాయికి ఎంపికయ్యాను..
గురుకుల పాఠశాలలో చదువుతోపాటు క్రీడలకు మొదటి ప్రాధాన్యత ఉంటుంది. ఈ క్రమంలోనే జిల్లా స్థాయిలో ప్రతిభ చాటడమే కాకుండా నవంబర్ 26న నిర్వహించిన 3కిలోమీటర్ల పరుగుపందెంలో ఇంటర్ సొసైటీ క్రీడల్లో జాతీయస్థాయిలో స్థానం సంపాదించగలిగాను. మా పాఠశాల ఉపాధ్యాయుల ప్రోత్సాహం బాగుంటుంది.
– సురేశ్, ఎంపీసీ మొదటి సంవత్సరం
గర్వంగా ఉన్నది..
ఇంటర్ సొసైటీ రాష్ట్రస్థాయి క్రీడల్లో హైజంప్లో నాకు రాష్ట్రస్థాయిలో 4వ స్థానం లభించడం ఆనందంగా ఉంది. మమ్మల్ని ప్రోత్సహిస్తున్న ప్రిన్సిపాల్తోపాటు ఉపాధ్యాయ బృందానికి, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకువస్తా.
– హరీశ్, 8వ తరగతి విద్యార్థి
ఖోఖోలో మంచి పేరు వచ్చింది
ఇంటర్ సొసైటీ రాష్ట్రస్థాయి క్రీడల్లో ఖోఖోలో నాకు మంచి పేరు వచ్చింది. తాను జాతీయస్థాయికి ఎంపిక కావడం ఎంతో గర్వంగా ఉంది. నన్ను ఇంతగా ప్రోత్సహించిన ప్రిన్సిపాల్, పీఈటీలకు కృతజ్ఞతలు.
– గౌతమ్, 10వ తరగతి విద్యార్థి
26 పతకాలు సాధించారు
గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థులు నవంబర్ నెలలో నిర్వహించిన ఇంటర్ సొసైటీ రాష్ట్రస్థాయి క్రీడల్లో 68 మంది పాల్గొన్నారు. వివిధ విభాగాల్లో 26 రకాల పతకాలు సాధించారు. రాష్ట్రస్థాయిలో పాల్గొన్న విద్యార్థుల్లో ఇద్దరు ఖోఖో, మరో ఇద్దరు పరుగుపందెంలో బహుమతులు సాధించి జాతీయ స్థాయికి ఎంపికయ్యారు.
– దేవీదాస్, పీఈటీఉపాధ్యాయుడు