కమ్మర్పల్లి/ఖలీల్వాడి/ డిచ్పల్లి, జనవరి 21: రాష్ట్రంలో సీఎం కేసీఆర్ కృషి, ముందు చూపుతో సంపద సృష్టి జరుగుతున్నదని రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల్లో ఆ సంపద ప్రజలకు చెలామణి జరుగుతుండడంతో ప్రజలకు కొనుగోలు శక్తి దరి చేరుతున్నదని అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ గ్రౌండ్లో నమస్తే తెలంగాణ-తెలంగాణ టుడే ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రాపర్టీ షోను శనివారం మంత్రి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. ప్రజల కొనుగోలు శక్తి పెరగడానికి ప్రజా బాహుళ్యంలో డబ్బు చెలామణి జరగడం తప్పనిసరి అని పేర్కొన్నారు. సంపద సృష్టి ప్రాపర్టీ రంగ అభివృద్ధికి బ్యాక్బోన్ లాంటిదన్నారు. రాష్ట్రంలో వివిధ సంక్షేమ పథకాలతో నగదు చెలామణి జరుగుతోందని వివరించారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కృషితో రూ.3 లక్షల కోట్లతో కొత్త పరిశ్రమల ఏర్పాటుతోపాటు 20 లక్షల ఉద్యోగాల సృష్టి జరిగిందని తెలిపారు. ఐటీ ఎగుమతులు 60 వేల కోట్ల నుంచి 2 లక్షల 70 వేల కోట్లకు పెరిగాయన్నారు.ఇలాంటి సంపద సృష్టి, ప్రజల్లోకి పంపిణీ ఫలితంగా తెలంగాణ గ్రోత్ రేటు పెరిగిందన్నారు. కేసీఆర్ పరిపాలనా వికేంద్రీకరణ తెచ్చి కొత్త జిల్లాలు, మండలాలను ఏర్పాటు చేయడంతో రియల్ రంగం అభివృద్ధిలో వేగం పెంచిందన్నారు.
దేశంలో నంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణను నిలుపాలన్న కేసీఆర్ దీక్ష, పట్టుదల ఫలించిందన్నారు. దేశంలో ఎందరో ముఖ్యమంత్రులు తెలంగాణ మోడల్ దేశానికి కావాలని పేర్కొంటున్న విషయాన్ని గుర్తు చేశారు. పేద, మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉండే ప్రాజెక్టులను రూపొందిస్తే వ్యాపారమూ అభివృద్ధి చెందుతుందని ప్రాపర్టీ రంగ వ్యాపారులకు సూచించారు. హైదరాబాద్ లాంటి మహా నగరాల్లో మాత్రమే నిర్వహించే ప్రాపర్టీ షోను వేగంగా అభివృద్ధి చెందుతున్న నిజామాబాద్ నగరంలో ఏర్పాటుచేసిన నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ప్రయత్నం అభినందనీయమన్నారు.
ప్రాపర్టీ షోను జిల్లా ప్రజలు వినియోగించుకోవాలని కోరారు.అన్ని రకాల అనుమతులు గల వ్యాపారులను, బ్యాంకర్లను, డీలర్లను ఒకే గొడుగు కిందకు తెచ్చి వినియోగదారులక నాణ్యమైన అవకాశాలు అందిస్తున్నారని ప్రశంసించారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రాంకిషన్ రావు, ఎస్బీఐ డీజీఎం ప్రఫుల్లా కుమార్ జెనా, యూబీఐ డీజీఎం నరేంద్ర కుమార్, కెనరా బ్యాంక్ ఏజీఎం శ్రీనివాస్ రావు, డీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, నమస్తే తెలంగాణ బ్రాంచ్ మేనేజర్ గడ్డి ధర్మరాజు, ఎడిషన్ ఇన్చార్జి లక్మ రమేశ్, బ్యూ రో చీఫ్ జూపల్లి రమేశ్, ఏడీవీటీ మేనేజర్ శ్రీకాంత్, ఏసీఎం సునీల్, సిబ్బంది పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ అండ్ టీమ్ కృషితో తెలంగాణలో భూమికి, ఇతర ప్రాపర్టీలకు పటిష్ట భద్రతా వ్యవస్థ ఏర్పడింది. తెలంగాణలో ఒకప్పుడు భూమి భారం..కానీ నేడు ఆభరణం. భూమి అమ్ముకోవడం అనే స్థితి నుంచి భూమి కొనుక్కోవడం అనే ఆలోచన సామాన్యుల నుంచి అన్ని వర్గాల వారికి పెరుగుతుండడం వెనుక సీఎం కేసీఆర్, ఆయన వెనుక మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, వేముల ప్రశాంత్రెడ్డి లాంటి వారి కృషి ఉంది. ఉమ్మడి మెదక్, కరీంనగర్, వరంగల్ బార్డర్లోని మా గ్రామం దూలిమెట్లలో మా తండ్రి పదేండ్ల క్రితం 18 ఎకరాల భూమిని కేవలం రూ.20 వేలకే ఎకరం చొప్పున అమ్మారు. దాని ధర ఇప్పుడు రూ.30 లక్షలకు ఒక ఎకరంగా పెరిగింది. మా గ్రామాన్ని సీఎం కేసీఆర్ మండలంగా మార్చారు. ప్రాపర్టీకి కేసీఆర్ సెక్యూరిటీ కల్పించడంతోపాటు మండలంగా మార్చడం లాంటి కారణాలు మా గ్రామంలో భూముల ధరను పెంచాయి. భూమికి, ఇండ్లకు భరోసా ఉండాలి. ఇలాంటి భరోసా లభించే విధంగా అన్ని ఒకే గొడుగు కింద అందేలా నమస్తే తెలంగాణ ప్రాపర్టీ షో నిర్వహిస్తున్నది.
-తిగుళ్ల కృష్ణమూర్తి, నమస్తే తెలంగాణ ఎడిటర్
నిజామాబాద్ జిల్లా ప్రజలకు ప్రాపర్టీ రంగంలో ఒకే ప్లాట్ఫాంపై అవసరమైన సేవలు అం దించాలనే లక్ష్యంతో నమస్తే తెలంగాణ-తెలంగాణ టుడే అధ్వర్యంలో ప్రాపర్టీ షో ఏర్పాటు చేసింది. ఉద్యమంలోంచి ప్రజల కోసం పుట్టిన నమస్తే తెలంగాణ స్వరాష్ట్రంలో ఉద్యోగాల కోసం ఇస్తున్న నోటిఫికేషన్ల సమయంలో అభ్యర్థులకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత అవగాహన సదస్సులు నిర్వహించింది. అదేకోవలో ఆటో షోలు నిర్వహించాక, నిజామాబాద్ జిల్లాకు చెందిన వారు సైతం హైదరాబాద్లో ప్రాపర్టీ కొనుగోలుపై ఆసక్తి చూపుతుండడంతో వారికి ఒకే గొడుగు కింద సౌలభ్యం కలిగేలా ఇక్కడ ప్రాపర్టీ షో ఏర్పాటుచేశాం. అన్ని రకాల అనుమతులు ఉన్న వారితో షో నిర్వహిస్తున్నామన్నారు.
-డి.చిరంజీవి, నమస్తే తెలంగాణ వైస్ ప్రెసిడెంట్
నిజామాబాద్ నగరంలో రియల్ రంగం ఊపందుకోవడానికి రా ష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు ము ఖ్యకారణం. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించిన నమస్తే తెలంగాణ దిన పత్రిక ఇప్పుడు స్వరాష్ట్రంలోనూ బాధ్యతాయుతమైన పాత్రను పోషిస్తోస్తుండడం అభినందనీయం.
– దాదన్నగారి విఠల్రావు, జడ్పీ చైర్మన్
తెలంగాణ రాష్ట్రంలో పటిష్టవంతంగా పోలీస్ రక్షణ వ్యవస్థ ఏర్పాటైన నేపథ్యంలో భూముల క్రయ, విక్రయాల్లో జోరు పెరిగింది. పోలీసు వ్యవస్థ ద్వారా భద్రత పెంపొందించడంతో మార్కెట్లో సానుకూల వాతావరణం ఏర్పడి అన్ని రంగాల్లో అభివృద్ధి సాధ్యమైంది. ఇందుకు సీఎం కేసీఆర్ పరిపాలన దక్షత ముఖ్య కారణం. నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో నిజామాబాద్లో తొలిసారి ఇలాంటి వేదిక ఏర్పాటు చేయడం అభినందనీయం.
– కేఆర్ నాగరాజు, పోలీస్ కమిషనర్
నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే అధ్వర్యంలో ప్రాపర్టీ షో ఏర్పాటుచేయడం అభినందనీయం. జిల్లా ప్రజల్లో రియల్ రంగంపై ఆసక్తి పెరుగుతున్న దశలో నమస్తే తెలంగాణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రాపర్టీ షోతో చక్కని అవగాహన లభించింది. ధరణి తదితర కార్యక్రమాలతో భూములకు సంబంధించి రికార్డుల పరమైన భద్రత లభించింది. దీనితో ప్రాపర్టీ కొనుగోలు విషయంలో ఆసక్తి క్రమంగా పెరుగుతోంది. ఇలాంటి వారికి ప్రాపర్టీ షో ద్వారా ఒకే గొడుగు కింద అన్ని రకాల రియల్ ఎస్టేట్కు సంబంధించిన ప్రాజెక్టుల సమాచారం దొరుకుతున్నది.
-నారాయణ రెడ్డి, నిజామాబాద్ కలెక్టర్
హైదరాబాద్ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అనేక పట్టణాలు, నగరాల్లో ఎనలేని వృద్ధి కనిపిస్తోంది. ఇందులో భాగం గా నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే సంయుక్తంగా నిర్వహిస్తున్న ప్రాపర్టీ షోకు అద్భుతమైన స్పందన వస్తోం ది. ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ నమస్తే తెలంగాణ ప్రయత్నానికి ప్రజలు, ఆయా రంగాల నుంచి మద్దతు లభిస్తున్నది. ప్రజల సౌకర్యార్థమే ప్రాపర్టీ షో ఏర్పాటుచేశాం.
– ఎన్.సురేందర్ రావు,
ప్రకటనల విభాగం జనరల్ మేనేజర్,నమస్తే తెలంగాణ