కంఠేశ్వర్, ఏప్రిల్ 1: వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్తోపాటు 85 ఏండ్లు పైబడిన సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు ఇంటి వద్ద నుంచే ఓటుహక్కు వినియోగించుకునేందుకు 12-డీ ఫారాలను అందజేయనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు తెలిపారు. ఈనెల 20లోగా నిర్ణీత 12-డీ ఫారం నింపి సంబంధిత శాఖల నోడల్ అధికారుల ద్వారా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులకు అందజేయాలని సూచించారు. సోమవారం ఆయన కలెక్టరేట్లో అత్యవసర సేవలపరిధిలోకి వచ్చే వివిధ శాఖల నోడల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అత్యవసర సర్వీసులకు చెందిన వారికి ఎన్నికల సంఘం పోస్టల్బ్యాలెట్ ద్వారా ఓటుహక్కు వినియోగించుకునే అవకాశం కల్పిస్తున్నదని తెలిపారు. ఒక్కసారి పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకున్నవారికి ఎట్టి పరిస్థితుల్లోనూ మే 13న నిర్వహించే పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటువేసే అవకాశం కల్పించబోమని స్పష్టం చేశారు.
లోక్సభ ఎన్నికల్లో 85 ఏండ్లుపై బడిన సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు ఇంటివద్ద నుంచే ఓటు హక్కును వినియోగించుకునేందుకు 12-డీ ఫారాలను పంపిణీ చేయిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లా పరిధిలోని 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 85 ఏండ్లు పైబడిన ఓటర్లు 7,555 మంది ఉండగా.. మార్చి 30 నాటికి 3331 మంది, దివ్యాంగ ఓటర్లు 24,229 మంది ఉండగా 10,175 మందికి 12-డీ ఫారాలను అందజేయడం పూర్తయినట్లు ఆయన వివరించారు.