నిజామాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ యూనివర్సిటీ వ్యవహారం రోజురోజుకూ ముదురుతుండడంతో ప్రభుత్వం స్పం దించింది. వీసీ ప్రొఫెసర్ రవీందర్ గుప్తాకు కళ్లెం వేసింది. ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న వీసీ తీరుతో మిగిలిన యూనివర్సిటీల్లో వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఏర్పడడంతో దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా సరికొత్త అస్ర్తాలను తెరపైకి తీసుకొచ్చింది. రిజిస్ట్రార్గా కనకయ్యను నియమిస్తూ వీసీ శుక్రవారం నిర్ణయం తీసుకోవడం, గతంలో తొలగించిన వ్యక్తికే పట్టం కట్టడం తో పాలకవర్గ సభ్యుల ద్వారా సమాచారం అందుకున్న ఉన్నత విద్యా శాఖ సీరియస్గా స్పం దించింది. వీసీకి విచక్షణాధికారం అంటూ ఏమీ లేవని, దీనికి సంబంధించిన విధివిధానాలు, నియ మ, నిబంధనలకు సంబంధించిన మార్పులు, చేర్పులపై చాన్స్లర్ హోదాలో ఉన్న గవర్నర్ ఆమోదమే లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి వాకాటి కరుణ పేరుతో శనివారం ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇన్ని రోజులుగా వీసీ హోదాలో తాను ఏదైనా చేయొచ్చంటూ విర్రవీగిన రవీందర్ గుప్తా ఇకపై ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం లేకుండా ఉన్నత విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేయడం చర్చనీయాంశమైంది.
వర్సిటీలో పాలకవర్గం తీసుకునే నిర్ణయాలే ఇకపై చెల్లుబాటు అవుతాయని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. తెలంగాణ యూనివర్సిటీస్ యాక్ట్ 1991 ప్రకారం సెక్షన్ 15(1)ను ఉటంకిస్తూ వివరాలను పొందుపర్చారు. పాలకవర్గ సమావేశాల్లో తీసుకునే నిర్ణయాలను మాత్రమే ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందని, వ్యక్తిగతంగా ఎవరైనా ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా వాటికి, ప్రభుత్వానికి సంబంధం లేదని వాకాటి కరుణ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఒకవేళ ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవడం తథ్యమంటూ హెచ్చరించారు. ఈసీ భేటీలో నియమించిన రిజిస్ట్రార్కే పూర్తిగా అధికారం ఉంటుందని స్పష్టం చేశారు. వీసీ నియమించిన వ్యక్తులకు రిజిస్ట్రార్ కార్యాలయంతో ఎలాంటి సంబంధం ఉండదని ప్రకటించడం ద్వారా ఇప్పుడు వీసీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వైస్ చాన్సలర్ పేరిట విడుదలైన ఉత్తర్వులను అమలు చేయాల్సిన అవసరం లేదంటూ ప్రభుత్వ స్పష్టం చేసింది. వీసీ ఆదేశాలతో యూనివర్సిటీలో పనులు నిర్వహిస్తున్న వారందరికీ ప్రభుత్వ స్పందన గుణపాఠంగా మారబోతున్నది. సర్కారు ఇంతగా ఆదేశాలిస్తున్నప్పటికీ కొంత మంది అక్రమార్కులు మాత్రం యూనివర్సిటీ పెద్దలతో చేతులు కలిపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనులు చేస్తుండడాన్ని సీరియస్గానే పరిగణిస్తున్నట్లు తెలిసింది.
తెలంగాణ యూనివర్సిటీలో వెలుగు చూస్తున్న దౌర్భగ్యకరమైన దుస్థితిపై రాష్ట్రంలోని మిగిలిన యూనివర్సిటీల్లోని సిబ్బంది, విద్యార్థులు నవ్వుకుంటున్నారు. వీసీ ఆగడాలపై తీవ్రంగా చర్చించుకుంటున్నారు. ఓయూ నుంచి వచ్చిన ప్రొ.నిర్మలా దేవి ఆగమేఘాల మీద వచ్చి మూడు రోజుల్లోనే తిరుగు పయనమైంది. ఈ ఘటనతో గుణపాఠం తెచ్చుకోవాల్సిన తెలంగాణ యూనివర్సిటీలోని ప్రొఫెసర్లు మాత్రం తీరు మార్చుకోకపోగా వీసీకి వత్తాసు పలకడంపై అంతటా చర్చ జరుగుతున్నది. వీసీ ఆదేశాలే తనకు శిరోధార్యమన్నట్లుగా ప్రొ.కనకయ్య శుక్రవారం జెట్ స్పీడ్తో వచ్చి ఉత్తర్వులను అందుకోవడం, ఆ వెంటనే రిజిస్ట్రార్ సీట్లో ఆసీనులు కావడంపై టీయూలో పని చేస్తున్న అకాడమిక్, నాన్ అకడమిక్ సిబ్బంది విమర్శలు గుప్పిస్తున్నారు. యూనివర్సిటీని ఐక్యంగా కాపాడుకోవాల్సిన సమయంలో అక్రమార్కులతో చేతులు కలుపుతున్న వారిని టీయూ నుంచి బహిష్కరించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. తాజాగా ఉన్నత విద్యా శాఖ నుంచి వెలువడిన ఉత్తర్వులతో ప్రభు త్వ లెక్కల ప్రకారం ప్రొ.యాదిగిరి మాత్రమే రిజిస్ట్రార్గా కొనసాగుతున్నట్లుగా తేలిపోయింది. వీసీ నియమించిన వ్యక్తులకు రిజిస్ట్రార్ కార్యాలయానికి ఎలాంటి సంబంధమే లేదని స్పష్టమైంది. ఒకవేళ ఎవరైనా వీసీ ఆదేశాల మేరకు రిజిస్ట్రార్ కుర్చీలో వచ్చి కూర్చుంటే మాత్రం వారిపై తీసుకోబోయే కఠినమైన చర్యలకు పాత్రధారులుగా మిగలడం తథ్యమని ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
వారం, పది రోజుల్లోనే యూనివర్సిటీలో కీలక పరిణామాలు జరిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. యూనివర్సిటీ పరువు రోజురోజుకూ బజారున పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఇందులో భాగంగానే గత 22 నెలలుగా తెలంగాణ విశ్వవిద్యాలయంలో జరిగిన అక్రమాలపై విచారణకు వేగంగా పావులు కదులుతున్నా యి. పాలకవర్గం ఇచ్చిన సమాచారంతోపాటు యూనివర్సిటీ వర్గాలతో తెప్పించుకున్న విషయాలను క్రోడీకరిస్తున్న ప్రభుత్వం త్వరలోనే అక్రమార్కులకు సరైన గుణపాఠం చెప్పేందుకు సిద్ధమవుతున్నది. ఇందులో రిజిస్ట్రార్గా అక్రమంగా నియామకమై చెలరేగిపోయిన వ్యక్తుల భరతం పట్టేందుకు సన్నాహాలు కొనసాగుతున్నాయి. ఓయూ నుంచి వచ్చి టీయూలో విర్రవీగిన ప్రొఫెసర్ నిర్మలాదేవి దగ్గరి నుంచి టీయూ వీసీ ఆదేశాలతో రిజిస్ట్రార్ కుర్చీలో ఆసీనులైన ప్రొ.విద్యావర్ధిని, ప్రొ.కనకయ్యపై చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. గత పాలకవర్గ సమావేశాల్లో పలువురు ప్రొఫెసర్లపై క్రిమినల్ చర్యలకు తీర్మానం చేశారు. వీరిపై త్వరలోనే చర్య లు తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. శనివారం విడుదలైన ఉన్నత విద్యా శాఖ కార్యదర్శి లేఖతో టీయూలోని అక్రమార్కుల్లో కాసింత వణుకు పుట్టినట్లు అయ్యింది.