ఎల్లారెడ్డి, డిసెంబర్ 17: నూనె గింజ పంటల్లో వేరుశనగ(పల్లి) ప్రధానమైనది. వాతావరణ పరిస్థితి మేరకు విత్తనాలు వేసుకొని సస్యరక్షణ చేపడితే అధిక దిగుబడి సాధించొచ్చు. అయితే పల్లికాయ విత్తే సమయంలోనే అందుబాటులోకి వచ్చిన యంత్రాలను ఉపయోగిస్తే పెట్టుబడి ఖర్చులు తగ్గే అవకాశమున్నది. రైతన్నకు పంటసాగులో ఖర్చులు తగ్గాలంటే మెళకువలు పాటించాలి. ఆరుగాలం కష్టపడే రైతులు అందుబాటులోకి వచ్చిన యంత్రాలను ఉపయోగించడంతో ఖర్చులు తగ్గి ఆదాయం పెరుగుతుంది. యాసంగిలో రైతులు ఎక్కువగా వేరుశనగ సాగుకు ఆసక్తి చూపుతున్నారు. ఎర్రనేలలు, ఇతర నేలల్లో ఎక్కువగా వేరుశనగ వేసేందుకు రైతులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గతంలో మాదిరిగా నాగలితో వేరుశనగ విత్తనాలు వేయాలంటే ఖర్చు విపరీతంగా పెరిగింది. దానికి బదులుగా సీడ్ ప్లాంటర్ను ఉపయోగిస్తే ఎకరానికి సాగు వ్యయం రూ.9వేల వరకు తగ్గుతుందని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు.
నాగలితో ఇలా..
ఎకరం పొలంలో నాగలితో వేరుశనగ విత్తనాలు వేయాలంటే మామూలుగా రెండు సాళ్లు దుక్కి దున్నాలి. నాగలితో రోజుకు అర ఎకరం మాత్రమే విత్తనాలు వేసే అవకాశముంటుంది. నాగలికి రోజుకు మూడు వేలు అద్దె, విత్తనం వేయడానికి ఐదు వందలతో ఒక కూలి అవసరం అంటే ఒక ఎకరం వేరుశనగ వేయడానికి రూ.7వేలు ఖర్చవుతుంది. కిలో విత్తనాల ధర మార్కెట్లో రూ.120. నాగలి ద్వారా విత్తనం వేస్తే ఎకరానికి 60కిలోల విత్తనాలు అవసరం ఉంటుంది. ఎకరం భూమిలో వేరుశనగ వేసేందుకు మొత్తం రూ.14,200 ఖర్చు అవుతుంది.
9వేల తేడా..
వేరుశనగ పంటను వేసే రైతులు సీడ్ ప్లాంటర్ను ఉపయోగించి విత్తనాలు వేయడంతో ఎకరానికి సుమారు రూ.9వేలు ఆదా చేసుకోవచ్చు. కేవలం రూ.7500తో కొనుగోలు చేసే సీడ్ ప్లాంటర్ ద్వారా సాగు ఖర్చు భారీగా ఆదా అవుతుంది. సీడ్ ప్లాంటర్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురంలో లభిస్తున్నాయి. కొన్ని గ్రామాల్లో సీడ్ ప్లాంటర్లు తెచ్చుకున్న రైతులు వారి పొలాల్లో విత్తనాలు వేసిన తర్వాత వాటిని రోజుకు ఐదు వందల రూపాయల చొప్పున కిరాయికి ఇస్తున్నారు.
సీడ్ ప్లాంటర్తో..
సీడ్ ప్లాంటర్తో ఎకరం వేరుశనగ పంట వేయడానికి కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది.ఏడున్నర వేలు విలువ చేసే సీడ్ ప్లాంటర్తో రోజుకు ఒక ఎకరంలో విత్తనాలు వేయడానికి అవకాశం ఉంది. ఒక కూలీ సీడ్ ప్లాంటర్తో ఎకరం విస్తీర్ణంలో విత్తనాలు వేయొచ్చు. కూలీకి ఐదు వందల రూపాయలు చెల్లించవచ్చు. ఎకరానికి 40కిలోల విత్తనాలు మాత్రమే సరిపోతాయి. సీడ్ ప్లాంటర్తో వేరుశనగ వేస్తే ఎకరానికి మొత్తం రూ.5300 ఖర్చు అవుతుంది.
యాసంగిలోలాభదాయకం
యాసంగిలో వేరుశనగ(పల్లి) సాగు ఎంతో లాభదాయకంగా ఉంటుంది. పంట మార్పిడితోనే దిగుబడి పెరుగుతుంది. సీఎం కేసీఆర్ ఆలోచనకు ఆకర్షితుడినై మూడు ఎకరాల పొలంలో వేరుశనగ సాగు చేస్తున్న. యాసంగిలో వరిసాగు చేసి దళారుల చేతిలో మోసపోయే బదులు ప్రభుత్వం చెప్పిన విధంగా ఇతర పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలి.
ఖర్చు తగ్గుతుంది..
మా ప్రాంతంలో రెండు సీజన్లలో వ రి సాగు చేసే వా ళ్లం. ఇప్పుడు వేరుశనగ వేయాలని నిర్ణయించాం. విత్తనాలు వేసేందుకు సీడ్ప్లాంటర్ను ఉపయోగించా. నేనే స్వయంగా తెచ్చుకొని వేశాను. దీంతో నాలుగు ఎకరాల భూమిలో నాలుగు రోజుల్లో విత్తనాలు వేశాను. నాగలితో వేస్తే ఎనిమిది రోజులు అయ్యేది.