ఎల్లారెడ్డి, డిసెంబర్ 8: కిడ్నీ సమస్యలు వచ్చినా.. డయాలసిస్ పరిస్థితికి వస్తే ఆ రోగుల బాధ వర్ణనాతీతం. మధ్యతరగతి, పేదవారి కష్టాలు ఎంత చెప్పినా తక్కువే. డయాలసిస్ కోసం ఎంతో డబ్బు ఖర్చవుతుంది. అలాంటి వారికి రాష్ట్ర ప్రభుత్వం భరోసా కల్పిస్తున్నది. సర్కారు తీసుకున్న నిర్ణయం ఎంతో మందికి వరంలా మారింది. కామారెడ్డి జిల్లాలోని నియోజకవర్గానికో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో కిడ్నీ రోగులు డయాలసిస్ చేసుకోవాలంటే హైదరాబాద్కు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. తెలంగాణ ఏర్పాటు అనంతరం టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక వైద్యానికి పెద్దపీట వేస్తున్నది. రోగులకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా, అందరికీ అందుబాటులో ఉండేలా డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. జిల్లాలోని కామారెడ్డి, బాన్సువాడ, బిచ్కుంద, ఎల్లారెడ్డి ప్రాంతాల్లో డయాలసిస్ కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
కామారెడ్డిలో..
జిల్లా కేంద్రమైన కామారెడ్డి పట్టణం రెండు సంవత్సరాల క్రితం డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దీంతో హైదరాబాద్కు వెళ్లే కిడ్నీ రోగుల సంఖ్య తగ్గింది. మొత్తం 300-400 మంది రోగులు ఉండగా, డయాలసిస్ కేంద్రంలో రోజుకు సుమారు 10 మంది రక్తాన్ని శుద్ధి చేసుకుంటున్నారు.
బాన్సువాడలో..
స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి చొరవతో సంవత్సరం క్రితం బాన్సువాడలో 10 పడకలతో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇది బాన్సువాడ పట్టణంతోపాటు నస్రుల్లాబాద్, వర్ని, గాంధారి తదితర మండలాలకు చెందిన డయాలసిస్ పేషెంట్లకు అందుబాటులోకి వచ్చింది. ఇక్కడ రోజుకు 16 మంది సేవలు పొందుతున్నారు.
బిచ్కుందలో..
మహారాష్ట్ర, కర్నాటక రాష్ర్టాల సరిహద్దులో ఉన్న బిచ్కుందలో మంత్రి హరీశ్రావు ఇటీవల డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించారు. సరిహద్దులో ఉన్న ఇతర రాష్ర్టాల ప్రజలకూ ఇక్కడ డయాలసిస్ సేవలు అందుతున్నాయి. రోజుకు సుమారు ముగ్గురు రోగులు డయాలసిస్ సేవలు పొందుతున్నారు. కర్నాటకకు చెందిన ముగ్గురు డయాలసిస్ను ఉపయోగించుకోవడం విశేషం.
త్వరలో ఎల్లారెడ్డిలో..
ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలో ఐదు పడకల డయాలసిస్ సెంటర్ మంజూరైంది. కేంద్రం ఏర్పాటుకు కావాల్సిన నిధులు మంజూరు కాగా, అధికారులు స్థల పరిశీలన చేశారు. ఎమ్మెల్యే జాజాల సురేందర్ చొరవతో ఇక్కడున్న 30 పడకల ప్రభుత్వ దవాఖానను 100 పడకల దవాఖానగా మార్చారు. త్వరలోనే ఎల్లారెడ్డి పట్టణంలో డయాలసిస్ సెంటర్ ప్రారంభమై ప్రజలకు అందుబాటులోకి రానున్నది.