కామారెడ్డి, డిసెంబర్ 24 : అయోధ్య అక్షింతలు కామారెడ్డి నగరానికి వచ్చిన సందర్భంగా తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో అక్షింతల కలశాలతో పురవీధుల గుండా ఆదివారం శోభాయాత్ర నిర్వహించారు. ఈ శోభాయాత్రను కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. శోభాయాత్ర స్థానిక ధర్మశాల నుంచి సరస్వతీ శిశు మందిర్ పాఠశాల వరకు కొనసాగింది. శోభాయాత్రలో హిందువులు నృత్యాలు చేస్తూ యాత్రను కొనసాగించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర తీర్థ క్షేత్ర సంపర్క అభియాన్ ప్రాంత సంయోజక్ గణపురం రాజేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మర్యాద పురుషోత్తముడు శ్రీరామచంద్రుల మందిరం సాకారం కానున్నదని తెలిపారు. అక్షింతలు కలశాలలో తయారుచేసి 700 గ్రామాలకు ఇచ్చామని చెప్పారు. శోభాయాత్రలో చిన్నారులు రాముడి వేషధారణలో సందడిచేశారు. కార్యక్రమంలో హిందూ సంఘాల నాయకులు, తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.