సదాశివనగర్, ఫిబ్రవరి 2 : రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రతిఒక్కరూ తమవంతు కృషి చేయాలని, ప్రమాదాలు జరిగినప్పుడు విధిగా సహకారం అందించి ప్రాణాలు కాపాడాలని కామారెడ్డి ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి అన్నా రు. మండలంలోని ఓ ఫంక్షన్ హాల్లో సదాశివనగర్ సీఐ రామన్, ఎస్సై రాజేశ్, రాష్ట్ర రోడ్డు సేప్టీ బృందం ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఎస్పీ పాల్గొని మాట్లాడారు. జిల్లాలో గత సంవత్సరం 261 రోడ్డు ప్రమాదాల్లో 223 మంది మ రణించారన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు.. ప్రజల సహకారంతో నివారణ చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
ప్రతిఒక్కరూ జాగ్రత్తలు పాటిస్తే ప్రమాదాలను నివారించవచ్చన్నారు. వాహనాల వేగం నియంత్రించడం కోసం జిల్లాలోని జాతీయ రహదారి పై స్పీడ్ గన్లు ఏర్పాటు చేశామన్నారు. రోడ్డు ప్రమాదాల్లో సదాశివనగర్ రాష్ట్రంలోనే నాల్గో స్థానంలో ఉందన్నా రు. ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలన్నారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయడంతో ప్రమాదాల్లో తలకు తీవ్ర గాయాలై మృతి చెందిన సంఘటనలు ఎక్కువగా ఉన్నాయన్నారు. తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇవ్వరాదన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర రోడ్డు సేప్టీ బృందం ఆధ్వర్యంలో డాక్టర్లు రోడ్డు భద్రత, ప్రాథమిక చికిత్సపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అనోన్య, ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్, జిల్లా రోడ్డు రవాణా అధికారిణి వాణి, ఎంవీఐ శ్రీనివాస్ రెడ్డి, రోడ్డు ప్రమాదాల నివారణ డీఎస్పీ చంద్రభాను, డీఎస్పీ హెడ్ క్యార్టర్ ఉదయ కృష్ణ, జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన సీఐలు, ఎస్సైలు, సిబ్బంది, సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాధిక, డిగ్రీ కళాశాల అధ్యాపకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, వాహనదారులు తదితరులు పాల్గొన్నారు.