ఇందూరు(నిజామాబాద్): విధి నిర్వహణలో ప్రాణాలను కోల్పోయిన పోలీసులతోనే శాంతియుత వాతావరణం నెలకొందని వారి త్యాగాలను గుర్తు చేసుకోవడానికి ఈనెల 21 నుంచి 31వ తేదీ వరకు పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు జిల్లా పోలీస్ కమిషనర్ కార్తికేయ తెలిపారు. రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న వారోత్సవాల్లో వారం రోజుల పాటు పలు కార్యక్రమాలను చేపడుతున్నామని వెల్లడించారు. జిల్లా కమీషనరేట్లోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ల పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో విద్యార్థులకు పోలీస్ స్టేషన్లో ఓపెన్హౌస్, వ్యాసరచన, రంగులు, పేయింటింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.
పోలీసు సిబ్బందికి వ్యాసరచన పోటీలు, మరణించిన సిబ్బంది కుటుంబాల సమస్యలు తెలుసుకోవడం, , రక్తదాన శిబిరాలు తదితర కార్యక్రమాలను జరుపుతున్నట్లు ఆయన తెలిపారు. 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడంతో పాటు 31న పోలీస్ ఫ్లాగ్ డే పేరుతో సంస్మరణ దినోత్సవాలు నిర్వహిస్తున్నామని సీపీ వెల్లడించారు.