నాగిరెడ్డిపేట్, డిసెంబర్ 28: నాగిరెడ్డిపేట్, ఎల్లారెడ్డి మండలాలకు నీరందించే పోచారం ప్రాజెక్టు నిండుకుండలా ఉన్నది. పూర్తి స్థాయి నీటితో కళకళలాడుతున్నది. యాసంగి పంటల సాగుపై రైతులకు భరోసా కల్పిస్తున్నది. ప్రాజెక్టు ఆయకట్టు కింద భూములు ఉన్న రైతులు వానకాలం పూర్తిస్థాయిలో పంటలు పండించగా.. యాసంగికి సైతం సిద్ధమయ్యారు. నాగిరెడ్డిపేట్ మండలంలోని 25 గ్రామపంచాయతీల పరిధిలో ఉన్న భూములకు పోచారం ప్రాజెక్టు సాగునీరు అందిస్తున్నది. మండలంతోపాటు ఎల్లారెడ్డి మండలం కలిపి మొత్తం 18వేల ఎకరాలకు సాగునీరు అందించేలా ప్రాజెక్టును నిర్మించారు.
ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1.820టీఎంసీలు(1,464 ఎంసీఎఫ్టీ)లు. ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండితే రెండు పంటలకు నీరు అందిస్తుంది. ప్రాజెక్టులో బుధవారం నాటికి 1.78టీఎంసీల (20.5అడుగుల) నీరు ఉన్నది. దీంతో యాసంగిలో 16,500 ఎకరాల్లో పంటలను సాగుచేసేందుకు రైతులు సిద్ధమయ్యారు. పోచారం ప్రాజెక్టు ద్వారా ఆయకట్టుకు వానకాలంలో ఏ జోన్ రైతులకు నీరు విడుదల చేశామని డీఈఈ వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రస్తుతం చెరువులు, కుంటల్లో కూడా నీరు సమృద్ధిగా ఉండడంతో బీ జోన్లో కూడా యాసంగిలో పంటలు సాగు అవుతాయని చెప్పారు.
జనవరి ఒకటిన నీటి విడుదల..
యాసంగి పంటల కోసం జనవరి ఒకటో తేదీ నుంచి నీటిని విడుదల చేస్తామని డీఈఈ వెంకటేశ్వర్లు తెలిపారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ నీటి విడుదలను ప్రారంభిస్తారని పేర్కొన్నారు.
పోచారం నీటి విడుదలపై నేడు సమావేశం
నాగిరెడ్డిపేట్. డిసెంబర్ 28: మండలంలోని పోచారం ప్రాజెక్టు నీటి విడుదలపై ఆయకట్టు రైతులతో గురువారం తైబందీ సమావేశం నిర్వహించనున్నట్లు ఇరిగేషన్ డీఈఈ వెంకటేశ్వర్లు బుధవారం తెలిపారు. ఆయకట్టు రైతులు మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయానికి ఉదయం 10 గంటలకు రావాలని సూచించారు.