ధర్పల్లి/ఇందల్వాయి/డిచ్పల్లి, మే 29 : పోచమ్మ తల్లి పండుగను ఆయా మండలాల్లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. మహిళలు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి బోనాలను సమర్పించారు. ధర్పల్లి మండల కేంద్రంలో వీడీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన పొచమ్మ పండుగలో ఎంపీపీ నల్ల సారికాహన్మంత్రెడ్డి, సర్పంచ్ ఆర్మూర్ పెద్ద బాల్రాజ్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. బోనాలతో శోభాయాత్ర నిర్వహించారు. పోతరాజుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఎంపీపీ సారికారెడ్డి అమ్మవారికి బోనం సమర్పించారు. వీడీసీ చైర్మన్ డాక్టర్ అంకం ఆనంద్, వీడీసీ సభ్యులు లాలాగౌడ్ శ్రీనివాస్గౌడ్, లింబాద్రి, మహేందర్, బద్దం నడ్పి గంగారెడ్డి, కుల సంఘాల పెద్దలు, గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు.
ఇందల్వాయి మండలం సిర్నాపల్లి, గన్నారం గ్రామాల్లో పోచమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. ఆయా గ్రామాల్లోని ప్రధాన వీధులగుండా బోనాల ఊరేగింపు నిర్వహించి అమ్మవారికి సమర్పించారు. సిర్నాపల్లి సర్పంచ్ తేలు విజయ్కుమార్, ఉప సర్పంచ్ నవీన్గౌడ్, ఆయా గ్రామాల వీడీసీ సభ్యులు పాల్గొన్నారు.
వానలు సమృద్ధిగా కురవాలని, పాడిపంటలు సల్లంగా ఉండాలని కోరుతూ డిచ్పల్లి మండలం మిట్టాపల్లిలో పోచమ్మ పండుగను గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి బోనాలను సమర్పించి మొక్కులను తీర్చుకున్నారు. సర్పంచ్ గణేశ్, ఎంపీటీసీ గంగాధర్, వీడీసీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.