నిజామాబాద్ క్రైం, డిసెంబర్ 4 : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని 5వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజారాం స్టేడియంలో నిర్వహించే ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలకు పోలీసు శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల 8వ తేదీ నుంచి 22వ తేదీ వరకు 12 రోజుల పాటు ప్రతి రోజు ఉదయం 5 గంటలకు ఈవెంట్స్ ప్రారంభిస్తారు. ఆదివారం స్టేడియంలో ఏర్పాట్లను సీపీ నాగరాజు పరిశీలించారు. అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశామని సీపీ తెలిపారు.
పోలీసు ఎంపిక ప్రక్రియ మొత్తం పారదర్శకంగా సాగుతుందని, ఎవరైనా తప్పుడు మార్గంలో ఉద్యోగం ఇప్పిస్తామని లేదా ఉద్యోగం వచ్చే విధంగా సహాయం చేస్తామని చెబితే అలాంటి వారి మాటలు ఎవరూ నమ్మి మోసపోవద్దని సీపీ సూచించారు. ప్రతి బ్యాచ్ ఎంపిక సమయంలో ప్రతి అంశం సీసీ కెమెరాల్లో రికార్డు అవుతుందని పేర్కొన్నారు. సీసీ కెమెరాల రికార్డులను సురక్షితంగా ఉంచుతామని, ఏవైనా విమర్శలు వస్తే సీసీ ఫుటేజీ ఆధారంగా విచారణ చేస్తామన్నారు. ప్రతి అభ్యర్థి వేలిముద్రలు తీసుకున్న తర్వాతే గ్రౌండ్లోకి అనుమతి ఉంటుందని, అభ్యర్థులు సెల్ఫోన్స్, ఇతర వస్తువులను తీసుకొని రావద్దని సూచించారు.