నిజామాబాద్ రూరల్, డిసెంబర్ 3: ఎన్నో ఏండ్ల నుంచి సాగునీటికి నోచుకోలేక పడావుగా ఉన్న భూములన్నీ ఇక పచ్చగా మారనున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు 20వ ప్యాకేజీ నిర్మాణ పనులు పూర్తికావడంతో పంటసాగుతో భూములన్నీ వినియోగంలోకి రానున్నాయి. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని మోపాల్, డిచ్పల్లి, ఇందల్వాయి, జక్రాన్పల్లి, ధర్పల్లి, సిరికొండ మండలాలకు చెందిన రైతులు పంటలను సాగుచేయడంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలువల్లో నీటిజాడలేక బోర్ల మీదనే ఆధారపడి పంటలు పండించే పరిస్థితి నెలకొన్నది.బోర్లలో గ్రౌండ్ వాటర్ తగ్గిపోతే యాసంగిలో సాగు చేసిన పంటలు ఎండిపోయే దుస్థితి.
రూరల్ సెగ్మెంట్లో ఇలా నాన్ కమాండ్ ఏరియాగా ఉన్న లక్ష ఎకరాల భూములకు సాగునీటి కొరత ఏర్పడింది. ఇదే విధంగా బాల్కొండ, మెట్పల్లి నియోజకవర్గాల్లోని మరో లక్ష ఎకరాల భూములకు సాగునీరు లేక అక్కడి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, అప్పటి ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్సీ కవిత, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సీఎం కేసీఆర్ను కలిసి ఇక్కడి రైతాంగం ఎదుర్కొంటున్న సాగునీటి కష్టాలను వివరించారు. దీనిపై సీఎం సానుకూలంగా స్పందించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో భాగంగా సారంగాపూర్ వద్ద 20వ ప్యాకేజీ కింద అవసరమైన పనులు చేపట్టేందుకు రూ.892 కోట్ల నిధులు మంజూరు చేశారు. ఈ నిధులతో సర్జిపూల్, పంపుహౌస్ తదితర పనులన్నీ పూర్తిచేశారు. త్వరలోనే రైతుల సాగునీటి కష్టాలు తీరనున్నాయి.
నెలాఖరులోపు వెట్ రన్
సారంగాపూర్ వద్ద నిజాంసాగర్ ప్రధాన కాలువ సమీపంలో సర్జిపూల్ హౌస్, పంపుహౌస్లు నిర్మించారు. పంపు హౌస్లో ఒక మోటరు డ్రైరన్ నిర్వహించగా మిగిలిన రెండు మోటర్లకు వారం రోజుల్లో డ్రై రన్ చేపట్టి ఉన్నతాధికారుల ఆదేశం మేరకు డిసెంబర్ నెలాఖరులోగా వెట్న్ ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. యాసంగిలో పంటల సాగుకు నీరు అందేలా చర్యలు తీసుకునేందుకు ఇంజినీరింగ్ అధికారులు నిమగ్నమయ్యారు. సర్జిపూల్ హౌస్లోకి వచ్చిన సుమారు 2500 క్యూసెక్కుల నీటిని పంపుహౌస్ ద్వారా తరలించేందుకు మూడు గేట్లు ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా నీటి ద్వారా పెద్ద పెద్ద బండరాళ్లు కొట్టుకొని వస్తే వాటి నిలుపుదల కోసం సర్జిపూల్ హౌస్లో 14 ట్రాస్ ర్యాక్లు బిగించారు. ఈ ట్రాస్ ర్యాక్లతో బండరాళ్లు సర్జి పూల్ హౌస్లో నుంచి పంపుహౌస్లోకి వెళ్లకుండా ఉంటుంది.
పూర్తయిన పంపుహౌస్
సర్జిపూల్ హౌస్ సమీపంలో పంపుహౌస్ నిర్మించారు. ఇందులో నుంచి నీటిని తోడేందుకు మూడు మోటర్లు బిగించారు. ఒక్కో మోటరు 30 మెగావాట్ల సామర్థ్యం కలిగి ఉంది. అధికారులు ఇందులోని ఒక మోటరును ఆరు నెలల క్రితమే డ్రై రన్ నిర్వహించగా సఫలీకృతమైంది. మరో ఒక వారంలో మిగతా రెండు మోటర్లకు డ్రై రన్ పూర్తి చేసి మొత్తం మూడు మోటర్లకు వెట్న్ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
నీటి సరఫరా కోసం ఐదు ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు
సర్జిపూల్ హౌస్, పంపుహౌస్ల నుంచి నీటిని తరలించడానికి అవసరమైన విద్యుత్ సరఫరా కోసం అధికారులు 5 ట్రాన్స్ఫార్మర్లను బిగించారు. ఇందులో 40 ఎంవీఏ సామర్థ్యం కలిగిన మూడు ట్రాన్స్ఫార్మర్లు, 16 ఎంవీఏ సామర్థ్యం కలిగిన రెండు ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి.
మాసాని చెరువు వరకు ప్రధాన కాలువ వెడల్పు సీసీ లైనింగ్ పనులు
సారంగాపూర్ వద్ద ఉన్న పంపుహౌస్ నుంచి నిజాంసాగర్ ప్రధాన కాలువ ద్వారా న్యాల్కల్ వద్ద ఉన్న మాసాని చెరువులోకి నీటిని మళ్లిస్తారు. ఈ నేపథ్యంలో నిజాంసాగర్ ప్రధాన కాలువకు కూడా ఆధునీకరణ పనులు చేపడుతున్నారు. పెద్దమొత్తంలో నీరు ప్రవహించేందుకు ఈ కాలువ ఇప్పుడున్న 17 మీటర్ల వెడల్పు నుంచి 30 మీటర్ల వెడల్పునకు పెంచి సీసీ లైనింగ్ పనులు చేపడుతున్నారు. సారంగాపూర్ నుంచి కిలోమీటర్ దూరం వరకు 30 మీటర్ల వెడల్పుతో సీసీ లైనింగ్ పనులు పూర్తయ్యాయి. ఇంకా న్యాల్కల్ మాసాని చెరువు వరకు 7.7 కిలోమీటర్ల దూరం వరకు నిజాంసాగర్ ప్రధాన కాలువ సీసీ లైనింగ్ పనులు చేపట్టేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
ఎస్సారెస్పీ బ్యాక్వాటర్ నుంచి సర్జిపూల్ హౌస్లోకి నీరు వచ్చేదిలా..
నవీపేట్ మండలంలోని బినోల సమీపంలో ఎస్సారెస్పీ బ్యాక్వాటర్ నుంచి 2.5 కిలోమీటర్ల దూరం వరకు అప్రోచ్ ఛానల్ (కాలువ) ను నిర్మించారు. ఇక్కడి నుంచి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న సారంగాపూర్ వైపు సొరంగం (టన్నెల్) సీసీ లైనింగ్ పనులు పూర్తయ్యాయి. బినోల ఎస్సారెస్పీ బ్యాక్వాటర్ నుంచి అప్రోచ్ ఛానల్, సొరంగం ద్వారా సారంగాపూర్ సర్జిపూల్ హౌస్లోకి నీరు వచ్చి చేరుతోంది. ఇక్కడ ఏర్పాటు చేసిన మూడు డ్రాప్ట్ ట్యూబ్ల ద్వారా నీరు పంపుహౌస్లోకి చేరుతాయి. అనంతరం పంపుహౌస్లో బిగించిన మూడు మోటర్ల ద్వారా సుమారు 2500 క్యూసెక్కుల నీటిని సమీపంలో ఉన్న నిజాంసాగర్ ప్రధాన కాలువలోకి మళ్లించి, అక్కడి నుంచి నీరు న్యాల్కల్లోని మాసాని చెరువులోకి చేరుతుంది.
పనులన్నీ పూర్తయ్యాయి
సారంగాపూర్ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టు కింద 20వ ప్యాకేజీ కింద సివిల్ పనులన్నీ పూర్తయ్యాయి. బినోల, ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ నుంచి అప్రోచ్ చానల్, 18 కిలోమీటర్ల సొరంగం సీసీ పనులన్నీ పూర్తిచేశాం. పంపుహౌస్లో ఉన్న మూడు మీటర్లలో ఇంతకుముందే ఒక మోటరును డ్రై రన్ నిర్వహించాం. మిగతా రెండు మోటర్లు కూడా వారంలో డ్రై రన్ నిర్వహించి వెట్న్ ట్రయల్ను చేపడుతాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు డిసెంబర్ నెలాఖరులోపు పంపు మోటర్ల వెట్న్ ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
– బలరాం, డీఈ, కాళేశ్వరం ప్రాజెక్టు, నిజామాబాద్