దేశ నలుమూలల నుంచి సాధువులు రావడం.. వారి ఆశీస్సులు దొరకడం జిల్లా ప్రజల అదృష్టమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. నందిపేటలోని కేదారేశ్వర ఆశ్రమంలో కొనసాగుతున్న 57వ అఖిలాంధ్ర సాధుపరిషత్ సభలకు సోమవారం హాజరయ్యారు. అయోధ్య నుంచి వచ్చిన పీఠాధిపతుల నుంచి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలకు పుట్టినిల్లు తెలంగాణ అని.. ప్రతి ఒక్కరూ సనాతన ధర్మం కోసం కృషి చేయాలన్నారు. ఆశ్రమంలో కలియ తిరుగుతూ మహిళలను ఆత్మీయంగా పలుకరించారు. ఆశ్రమ వ్యవస్థాపకులు మంగిరాములు మహరాజ్తో కలిసి శివుని విగ్రహానికి అభిషేకం చేశారు.
నందిపేట్, జనవరి 30: సనాతన ధర్మం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. మండల కేంద్రంలోని కేదారేశ్వర ఆశ్రమంలో 57వ అఖిలాంధ్ర సాధు పరిషత్తు సభలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం నిర్వహించిన కార్యక్రమం లో ఎమ్మెల్సీ కవిత, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి, జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు పాల్గొని పూజలు చేశారు. అంతకుముందు ఎమ్మెల్సీ కవిత కలశాభిషేకం, అన్నప్రసాద పూజలో పాల్గొన్నారు. అయోధ్య నుంచి వచ్చిన పీఠాధిపతుల ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో పాల్గొని హంపీ పీఠాధిపతి విద్యారణ్యభారతీస్వామీజీని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలకు పుట్టినిల్లు తెలంగాణ అని పేర్కొన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలోని నందిపేట్ కేదారేశ్వర ఆశ్రమానికి దేశ నలుమూలల నుంచి సాధువులు రావడం, జిల్లా ప్రజలకు వారి ఆశీస్సులు లభించడం పూర్వజన్మ సుకృతమని అన్నారు. ఆర్మూర్కు ఒక ప్రత్యేకత ఉన్నదని, ఆర్మూర్ అసలు పేరు నవనాథపురమని తెలిపారు. తొమ్మిది మంది నవనాథులు తపస్సు చేసిన గడ్డ ఆర్మూర్ అని, ఈ రోజు మంగిరాములు మహరాజ్ కృషితో ఇంతమంది సాధువులు రావడం, జనాలకు వారి ఉపదేశం లభించడం గొప్ప విషయమన్నారు. కార్యక్రమంలో దేశ నలుమూలాల నుంచి వచ్చిన సాధువులు, స్థానిక ప్రజాప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.
కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్సీ కవితకు ఘనస్వాగతం పలికారు. ఆశ్రమంలో ఎమ్మెల్సీ మహిళలతో కలియదిరుగుతూ ఆత్మీయంగా పలుకరించి కరచాలనం చేశారు. ఆశ్రమ పరిసరాలను పరిశీలించి ఎంతో అభివృద్ధి చెందిందని ఈ ప్రాంతవాసుల అదృష్టమని కితాబునిచ్చారు. సమ్మేళనానికి హాజరైన సాధువులందరినీ ఎమ్మెల్సీ పలుకరించారు. ఆశ్రమ వ్యవస్థాపకులు మంగిరాములు మహరాజ్, ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డితో కలిసి శివుని విగ్రహానికి అభిషేకం చేశారు.
రాష్ట్రంలో ధర్మపరిరక్షణే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. మహాసభలు తమ ప్రాంతంలో నిర్వహిస్తుండడం సంతోషకరమన్నారు. ప్రభుత్వ చర్యలతో రాష్ట్రం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటుందన్నారు. ఆర్మూర్ గొప్ప దైవచింతన కలిగిన నేల అని, ఇక్కడ ఎన్నో ప్రముఖ ఆలయాలున్నాయని తెలిపారు. ముఖ్యంగా పరమశివుడి దివ్యక్షేత్రంగా సిద్ధుల గుట్ట భక్తకోటిని పరవశివంపజేస్తోందన్నారు. దేశం నలుమూలల నుంచి 150 మంది పీఠాధిపతులు, సాధువులు తమ నేలపై కాలు మో పడం తమకు శుభసూచకమని పేర్కొన్నారు. దేశమంతా తెలంగాణ మోడల్ అమలుకావాలని మహాపీఠాధిపతులు, సాధువులు సీఎం కేసీఆర్కు ఆశీర్వచనాలు అందించాలని కోరారు. కేదారేశ్వరాశ్రమ అభివృద్ధికి మరిన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ఆశ్రమంతో పాటు సిద్ధులగుట్ట అభివృద్ధికి ఎమ్మెల్సీ కవిత అందిస్తున్న సహకారాన్ని ఎప్పటికీ మరువలేమన్నారు. కేసీఆర్ ఆశీస్సులు, ఎమ్మెల్సీ కవిత సహకారంతో కేదారేశ్వర ఆశ్రమంలో కంటి దవాఖాన ఏర్పాటుచేసి, ఉచిత వైద్యసేవలు అం దించడానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే వెల్లడించారు.