మెండోరా, అక్టోబర్ 29 : జిల్లాలోని ఎస్సారెస్పీ ఎగువ ప్రాంతంలో ఉన్న మహారాష్ట్రలో నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లు అధికారులు మూసివేయించారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం అక్టోబర్ 29న మూసివేయాల్సి ఉండడంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలోని నీటిపారుదల శాఖ అధికారులు, కేంద్ర జలవనరుల సంఘం అధికారుల పర్యవేక్షణలో ఆదివారం ఉదయం నుంచి గేట్ల మూసివేత ప్రక్రియను ప్రారంభించారు. దీంతో ఎగువ ప్రాంతాల నుంచి ఇన్ఫ్లో నిలిచిపోయింది. ఈ సందర్భంగా ప్రాజెక్టు ఏఈఈ వంశీ మాట్లాడుతూ బాబ్లీ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 7.75 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 0.41 టీఎంసీల నీటి నిల్వ మాత్రమే ఉందని తెలిపారు.
ఈ సీజన్లో ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల నుంచి గోదావరి నుంచి ఎస్సారెస్పీలోకి 197.49 టీఎంసీల వరద వచ్చి చేరిందన్నారు. సుప్రీం కోర్టు ఉత్తర్వుల ప్రకారం జూలైలో గేట్లు తెరవగా..అక్టోబర్ 29న మూసివేశామన్నారు. తిరిగి మార్చి ఒకటిన తాగునీటి అవసరాల కోసం ఎస్సారెస్పీలోకి 0.6 టీఎంసీల నీటిని విడుదల చేస్తారని తెలిపారు. కార్యక్రమంలో సీడబ్ల్యూసీ ఈఈ వెంకటేశ్వర్లు, ఈఈ నాందేడ్ సీఆర్ బాన్సోద్, ఎస్సారెస్పీ ఈఈ ఎం.చక్రపాణి, ఏఈఈ ఎం.వంశీ, జేఈ సీడబ్ల్యూసీ సతీశ్ పాల్గొన్నారు.