BRS Protest | కోటగిరి, ఆగస్టు 6 : నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని దామరచెరువు తూము షట్టర్ సమస్యను ఇరిగేషన్ అధికారులు ఎట్టకేలకు పరిష్కరించారు. బీఆర్ఎస్ నాయకులు బుధవారం దామరచెరువు దుస్థితిపై ఆందోళన చేపట్టి నిరసన చేపడుతుండడంతో ఇరిగేషన్ అధికారులు తక్షణమే స్పందించారు. ఇరిగేషన్ డిఈ మొహమ్మద్ రఫీ, ఏఈ రవికుమార్ ఆధ్వర్యంలో ఇరిగేషన్ సిబ్బంది, లష్కర్లు చెరువు వద్దకు చేరుకుని తూము షట్టర్ పరిశీలించారు. తూము లో కురుకపోయిన షెట్టర్ ను జేసీబీ యంత్రాలతో షట్టర్ బయటకు తీసి పనులు చేపట్టారు.
ఎట్టకేలకు ఇరిగేషన్ అధికారులు స్పందించి దామరచర్ల కురుకు పోయిన షట్టర్ పైకి లేపడంతో పాటు ఆయకట్టు రైతులకు సాగునీరు వచ్చేలా ఏర్పాటు చేయడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. సుమారు నాలుగు గంటల పాటు జేసీబీ యంత్రాలతో ఇరిగేషన్ అధికారులు ప్రయత్నించి తూము షట్టర్ సమస్యను పరిష్కరించారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన కార్యక్రమాలతో ఇరిగేషన్ అధికారులు దిగివచ్చారు . బీఆర్ఎస్ నాయకులకు, ప్రజా ప్రతినిధులకు ఆయకట్టు రైతులు కృతజ్ఞతలు తెలిపారు.