కోటగిరి/ నిజామాబాద్ రూరల్/ ఖలీల్వాడి/ధర్పల్లి, రుద్రూర్/బోధన్రూరల్/ భీమ్గల్/ ఆర్మూర్, జనవరి 26: జిల్లావ్యాప్తంగా వసంత పంచమి వేడుకలను ప్రజలు గురువారం ఘనంగా జరుపుకొన్నారు. పలు ఆలయాల్లో సందడి నెలకొన్నది. పొతంగల్ మండలకేంద్రంలోని సాయిబాబా ఆలయ 20వ వార్షికోత్సవాన్ని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక పూజలు, హోమం, అభిషేకం తదితర కార్యక్రమాలను నిర్వహించారు. సాయిబాబా పల్లకీని ఊరేగించారు. ఆలయ ఆవరణలో జాతర నిర్వహించారు. శ్రీ బస్వలింగ అవధూత మహరాజ్ ప్రవచనలు చేశారు.
నిజామాబాద్ రూరల్ మండలంలోని మల్లారం గ్రామ జడ్పీ హైస్కూల్ విద్యార్థులకు వసంత పంచమి సందర్భంగా లింగేశ్వర గుట్ట ఆశ్రమ వ్యవస్థాపకులు పిట్లకృష్ణ మహరాజ్ బెల్టులు, టైలు పంపిణీ చేశారు. అనంతరం పిట్ల కృష్ణ మహరాజ్ను గ్రామస్తులు సన్మానించారు. కార్యక్రమంలో సర్పంచ్ నగేశ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మీసాల మధుకర్రావు, వైస్ ఎంపీపీ అన్నం సాయిలు, గ్రామపెద్దలు పాల్గొన్నారు.
జిల్లా కేంద్రంలోని సూర్యనగర్లో ఉన్న ఆదిత్య పాఠశాలలో అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని నిర్వహించారు. పురోహితుడు సుదర్శనం ఆధ్వర్యంలో 25 మంది విద్యార్థులకు అక్షరాభ్యాసం చేయించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శబ్ద తరంగిణి వ్యవస్థాపక అధ్యక్షుడు సేర్ల దయానంద్ హాజరై మాట్లాడారు. అనంతరం విశ్వహిందూ పరిషత్ గోరక్షణ కమిటీ సభ్యులు పిట్ల స్వామికి డైరీని అందజేశారు.
ధర్పల్లి మండల కేంద్రంలోని లిటిల్ హార్ట్స్, హంసవాహిని పాఠశాలల్లో వసంతపంచమి, గణతంత్రవేడుకలు నిర్వహించారు. సరస్వతీ మాత పుట్టినరోజు కావడంతో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. కార్యక్రమంలో లిటిల్ హార్ట్స్ పాఠశాల కరస్పాండెంట్ బీఏ శ్రీకాంత్, హెచ్ఎం సాధన, హంసవాహిని కరస్పాండెంట్ చక్రవర్తి, మాన్సింగ్ పాల్గొన్నారు.
రుద్రూర్ మండలకేంద్రంలోని రాజరాజేశ్వరి ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్బుక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో రాంరాజ్, రాజు, వెంకన్న, ఆలయ కమిటీ సభ్యుడు, రాజేశ్వర్ అప్ప పాల్గొన్నారు. చందూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో గ్రామ యువకులు విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు.
బోధన్ మండల పెంటాకుర్దులో వసంత పంచమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మేద సరస్వతీ ఆలయంలో మాత 18వ వార్షికోత్సవం నిర్వహించారు. వెయ్యి మంది మహిళలు కుంకుమార్చనలో పాల్గొన్నారు. సాలూరాలోని సరస్వతీ ఆలయంలో పూజలు నిర్వహించారు.
భీమ్గల్ మండల కేంద్రంలోని సరస్వతి విద్యామందిర్ పాఠశాలలో చిన్నారులకు అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా భీమ్గల్ ఎడ్యూకేషనల్ సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ బసంత్రెడ్డి హాజరై పూజలు నిర్వహించి అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ప్రారంభించారు.
వసంత పంచమిని పురష్కరించుకొని ఆర్మూర్ పట్టణంలోని శాస్త్రీనగర్ కాలనీలోని సరస్వతీమాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిన్నారులకు అక్షరాభ్యాసం నిర్వహించారు. భక్తులకు అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపకురాలు రాజరాజేశ్వరి, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.