ఖలీల్వాడి ఏప్రిల్ 21: నిజామాబాద్ జిల్లాలో భానుడు భగ్గుమంటున్నాడు. రోజురోజుకూ ఉగ్రరూపం దాలుస్తున్నాడు. ఎండవేడిమికి తట్టుకోలేక ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో తొలిసారిగా నిజామాబాద్ జిల్లాలో గరిష్ఠంగా ఏప్రిల్లో 43.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడం గమనార్హం. బుధవారం 42.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుకాగా గురువారం 43.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరోవారం రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. జిల్లాలో గతంలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత రికార్డులు ఏప్రిల్ నెలలో అధిగమించే అవకాశం ఉంది.
నిర్మానుష్యంగా రోడ్లు
భానుడి ధాటికి మధ్యాహ్నం రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. తప్పని పరిస్థితుల్లో బయటికి వెళ్లాల్సి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకొని వెళ్తున్నారు. వారం రోజుల వ్యవధిలో పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. అక్కడ భూతాపం తగ్గినా వేడిమి తగ్గడంలేదు. ఈదురు గాలులతో కూడిన వర్షం కామారెడ్డిని పలుకరించినా మిగిలిన ప్రాంతాల్లో మొహం చాటేసింది. ఇప్పటికే అధికారయంత్రాంగం ఎండదెబ్బల నుంచి ఉపశమన చర్యలకు ఆదేశాలు జారీ చేసింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రజలు బయట అడుగుతీసి అడుగు వేయడానికి భయపడుతున్నారు.
జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యుల సూచన
ఎండల ప్రభావం తగ్గేవరకు జాగ్రత్తలు తీసుకోవాలని చర్మవ్యాధుల నిపుణులు సూచిస్తున్నారు. జిల్లా కేంద్ర దవాఖానతోపాటు ఏరియా దవాఖానల్లో వడదెబ్బ బాధితుల కోసం ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేసి వైద్య సేవలు అందిస్తున్నారు. అన్ని ప్రాథమిక కేంద్రాల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచారు. బస్టాండ్, రైల్వేస్టేషన్ తదితర ప్రధాన కూడళ్ల వద్ద కూడా ప్రజల కోసం అందుబాటులో ఉంచారు. తప్పనిసరి పరిస్థితిలో బయటికి వచ్చేవారు మాత్రం ఎండవేడిమి నుంచి రక్షణకు చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. వృద్ధులు, చిన్న పిల్లలు జాగ్రత్తలు తప్పని సరిగా పాటించాలని తెలిపారు. ఎండతీవ్రత ఎక్కువ కావడంతో ప్రజలు ఎక్కువగా శీతలపానీయాలను ఆశ్రయిస్తున్నారు.