నిజామాబాద్ సిటీ, ఏప్రిల్ 11 : మహాత్మాజ్యోతి బాఫూలే చూసిన బాటలో పయనిస్తూ, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ నారాయణరెడ్డి పిలుపునిచ్చారు. పూలే 196వ జయంతి వేడుకలను జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో న్యూ అంబేద్కర్ భవన్లో సోమవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా కలెక్టర్ నారాయణరెడ్డి, సీపీ నాగరాజు, నగర మేయర్ నీతూ కిరణ్ హాజరయ్యారు. జ్యోతిబా ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కలెక్టర్ నారాయణరెడ్డి మాట్లాడుతూ.. ఫూలే స్ఫూర్తితో నేటి విద్యార్థులు, యువత విద్యను ఆయుధంగా మలచుకుంటే చక్కటి భవిష్యత్ను పొందవచ్చన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 80వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిందని, ఈ అవకాశాన్ని నిరుద్యోగు లు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో అందించే ఉచిత కోచింగ్ను సద్వినియోగం చేసుకొని నిజామాబాద్ నుంచి అత్యధికంగా ఉద్యోగాలు సాధించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. వ్యాసరచన, పెయింటింగ్ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు కలెక్టర్, సీపీ బహుమతులను ప్రదానం చేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు చిత్రామిశ్రా, చంద్రశేఖర్, బీసీ నాయకులు నరాల సుధాకర్, వినోద్కుమార్, రాజేశ్వర్, మారయ్యగౌడ్, జిల్లా అధికారులు, విద్యార్ధులు పాల్గొన్నారు.