మోర్తాడ్, మార్చి15: మండలంలోని దోన్పాల్ ఉల్లిగడ్డల ఊరుగా పేరొందింది. దీనికి కారణం ఈగ్రామంలో ఏటా ఉల్లిగడ్డల పంటను వేయడం, వివిధ గ్రామాలకు వెళ్లి విక్రయించడం. ఈసారి కూడా దాదాపు 40 మంది రైతులు ఉల్లిగడ్డ పంటను పండించారు. పంట ఇప్పుడిప్పుడే చేతికి వస్తున్నది. పంట బాగా పండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
గ్రామంలోనే విక్రయాలు
ఉల్లిగడ్డ పంటను పండించిన రైతులు గ్రామంలోనే ఉల్లిగడ్డలను అమ్ముతారు. ప్రస్తుతం వంద రూపాయలకు ఆరుకిలోల వరకు విక్రయిస్తున్నారు. లేదా 50కిలోల బస్తాను రూ.600 నుంచి రూ.750వరకు డిమాండ్ను బట్టి విక్రయిస్తుంటారు. తెలిసిన వారు చుట్టు పక్కల గ్రామాల నుంచి దోన్పాల్ గ్రామానికి వచ్చి ఉల్లిగడ్డలను కొనుగోలు చేస్తుంటారు. అంతేగాక ఇక్కడి రైతులు మోర్తాడ్, బాల్కొండ, మెట్పల్లి, భీమ్గల్ తదితర ప్రాంతాల్లో అంగడి సమయాల్లో వెళ్లి విక్రయిస్తుంటారు. ఇక్కడ ఉల్లిగడ్డను పండించే రైతులు మందులను వాడకుండా చాలా మంది కేవలం బూడిదను ఉపయోగిస్తుంటారు. దీంతో ఉల్లిగడ్డ ఎక్కువకాలం చెడిపోకుండా ఉంటుందని రైతులు అంటున్నారు.
ధర పర్వాలేదు..
ఏండ్ల నుంచి ఉల్లిగడ్డను పండిస్తున్నాం. కానీ గతేడాది నుంచి ధర పర్వాలేదనిపిస్తుంది. అంతకు ముందు కిలో పది రూపాయలకే అమ్మెటోళ్లం. లాభాలు ఎక్కువ ఉండేవి కాదు. ఇప్పుడు కిలో రూ.15 నుంచి 17 వరకు ఉన్నందున పంట పండించినందుకు పర్వాలేదనిపిస్తుంది.
-గంగసాయన్న, దోన్పాల్