ఎడపల్లి (శక్కర్నగర్), మార్చి 15: ‘దళితబంధు’ పథకాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని, కష్టపడితే లాభాలు రెట్టింపు అవుతాయని కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు. ఎడపల్లిలోని రైతువేదిక భవనంలో దళితబంధు లబ్ధిదారులతో మంగళవారం అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన లబ్ధిదారులు ఎంచుకున్న యూనిట్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి రంగంలోనూ పోటీ ఉంటుందని, లాభాలను ఆర్జించడమే ధ్యేయంగా పనిచేయాలని సూచించారు. దళితబంధు నిధులను తిరిగి చెలించాల్సిన అవసరం లేదని, నిధులను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలన్నారు. రెండో విడుత దళితబంధు లబ్ధిదారుల ఎంపిక త్వరలో ప్రారంభం అవుతుందని, మొదటి విడుతలో ఎంపికైన వారు రెండో విడుత వారికి ఆదర్శంగా నిలువాలని సూచించారు. మండలంలోని జాన్కంపేట్ గ్రామానికి చెందిన ఎంబ రాజేశ్వర్ తాను ఎంచుకున్న కారుకు బదులుగా ‘డ్రోన్ స్ప్రేయర్’ యూనిట్ను ఏర్పాటు చేస్తానని తెలుపడంతో కలెక్టర్ అతడిని అభినందించారు. అనంతరం కలెక్టర్ నారాయణ రెడ్డి, ఆర్డీవో రాజేశ్వర్ను బోధన్కు చెందిన లబ్ధిదారులు సన్మానించారు. జడ్పీ వైస్ చైర్పర్సన్ ఎం.రజితాయాదవ్, ఎంపీపీ శ్రీనివాస్, సర్పంచ్ ఆకుల మాధవి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రమేశ్, ఎడపల్లి, రెంజల్, నవీపేట్, బోధన్ మండలాల ఎంపీడీవోలు, తహసీల్దార్లు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
నిధులు మంజూరు చేయాలని వినతి..
పోచారం గ్రామంలో పెండింగ్ పనులు పూర్తి చేసేందుకు నిధులు మంజూరు చేయాలని కలెక్టర్ను సర్పంచ్ కోల ఇంద్రకరణ్ కోరారు. పోచారం గ్రామాన్ని సందర్శించిన కలెక్టర్ దళితబంధుకు ఎంపికైన కుటుంబాలతో మాట్లాడారు. అనంతరం గ్రామంలోని పంచాయతీ కార్యాలయంతో పాటు, విద్యుదీకరణ పనులు పరిశీలించారు. గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలకు నిధులు అవసరమని సర్పంచ్ ఇంద్రకరణ్ కలెక్టర్ను కోరారు. సమస్య పరిష్కారానికి చర్యలు చేపడతానని కలెక్టర్ హామీ ఇచ్చారు.