రుద్రూర్/వర్ని, మార్చి15 : స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని, ఆయన కుటుంబ సభ్యులను విమర్శించే స్థాయి బీజేపీ నాయకుడు మల్యాద్రిరెడ్డికి లేదని, మరోసారి విమర్శలు చేస్తే తరిమి కొడుతామని టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు హెచ్చరించారు. నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రం, వర్ని మండలం శ్రీనగర్లో మంగళవారం వారు విలేకరులతో మాట్లాడారు. రుద్రూర్ జడ్పీటీసీ నారోజి గంగారాం మాట్లాడుతూ.. ఒకప్పుడు పోచారం నీడన బతికి ఆయనను విమర్శించే స్థాయికి ఎదిగావా? అని మల్యాద్రిరెడ్డిని విమర్శించారు. సర్పంచుల బాధ్యతలపై కనీస అవగాహన లేని ఆయన.. స్పీకర్పై విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. పార్టీలకు అతీతంగా నిరుపేదలందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేయిస్తున్న ఘనత స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిదేనని అన్నారు. గ్రామాల్లో అభివృద్ధిని చూసి ఓర్వలేకే మల్యాద్రిరెడ్డి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని టీఆర్ఎస్ వర్ని మండల అధ్యక్షుడు కల్లాలి గిరి, సీనియర్ నాయకుడు మేక వీర్రాజు విమర్శించారు. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డితోపాటు డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్రెడ్డిపై విమర్శలు చేసే స్థాయి మల్యాద్రిరెడ్డికి లేదన్నారు. వ్యవసాయభూముల్లో వరి పంట ఉన్నందున జాకోరా ఎత్తిపోతల పథకం నిర్మాణంలో తాత్సారం జరుగుతున్నదని, అవగాహన లేకుండా మాట్లాడవద్దని హితవు పలికారు.
త్వరలో జాకోరా, చందూర్ ఎత్తిపోతల పథకాలను ప్రారంభిస్తారని, పనులను ప్రారంభించని పక్షంలో తాను తలకోసుకుంటానని, ప్రారంభిస్తే మీరు కోసుకుంటారా? అని బీజేపీ నాయకులకు కల్లాలి గిరి సవాల్ విసిరారు. శ్రీనగర్లో కొనసాగుతున్న అభివృద్ధి పనుల కోసం ఇసుక తీసుకువెళ్తుంటే ఓర్వలేని బీజేపీ నాయకులు అడ్డుకుంటున్నారని విమర్శించారు. రుద్రూర్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మండల సీనియర్ నాయకుడు అక్కపల్లి నాగేందర్, ఏఎంసీ మాజీ చైర్మన్ సంజీవ్రెడ్డి, రైతుబంధు సమితి మండల కో-ఆర్డినేటర్ సంగయ్య, విండో చైర్మన్ సంజీవ్రెడ్డి, విండో మాజీ చైర్మన్ పత్తి రాము, కో-ఆప్షన్ సభ్యుడు మస్తాన్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పత్తి లక్ష్మణ్, కార్యదర్శి బాలరాజు, గ్రామశాఖ అధ్యక్షుడు తోట్ల గంగారాం, సీనియర్ నాయకులు కలీం, సయ్యద్ తదితరులు పాల్గొన్నారు.వర్నిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మండల పరిషత్ ఉపాధ్యక్షుడు దండ్ల బాలరాజు, కో-ఆప్షన్ మండల సభ్యుడు కరీం, రైతుబంధు సమితి మండల కో-ఆర్డినేటర్ సింగంపల్లి గంగారాం, సహకార సొసైటీ చైర్మన్ నామాల సాయిబాబా, సర్పంచ్ రాజు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.