నిజామాబాద్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రం లో రైతు ప్రయోజనకర నిర్ణయాలను సీఎం కేసీఆర్ అవలంబిస్తున్నారు. వరి అత్యధికంగా పండించే జాబితాలో టాప్ 2లో నిలిచిన రాష్ట్రంలో ప్రభుత్వమే దగ్గరుండి పంట ఉత్పత్తులను సేకరిస్తున్నది. ఇందుకోసం బ్యాంకురుణాలు తీసుకుని మరీ రైతు ల నుంచి ధాన్యాన్ని సేకరిస్తున్నది. వేల కోట్ల రూపాయల వ్యయంతో చేపడుతున్న ప్రక్రియ సాఫీగా ఇబ్బందుల్లేకుండా జరిగింది. 2021-22 వానకాలంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాలతో అవరోధాలు ఏర్పడాయి. అయినప్పటికీ ప్రభుత్వం మాత్రం ఆరుగాలం శ్రమించిన రైతుపక్షాన నిలబడి కొనుగోళ్లను చేపట్టింది. ఈ వానకాలంలో రికార్డు స్థాయిలో 802 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రూ.2200 కోట్ల విలువ చేసే ధాన్యాన్ని ఉభయ జిల్లాల ప్రభుత్వ యం త్రాంగం సేకరించింది. దాదాపు 11లక్షలకు పైగా మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో సేకరించారు. ధాన్యం అత్యధికంగా పండించే ఉమ్మడి జిల్లాలో ఈసారి దిగుబడులు భారీగా వచ్చాయి. నీళ్లు పుష్కలంగా ఉండడంతో వరి సాగు విస్తీర్ణం పెరగడంతోపాటు పంట సమృద్ధిగా వచ్చింది. దీంతో రైతులు సంబురం వ్య క్తం చేయగా… సర్కారే దగ్గరుండి పంటను కొనుగోలు చేసి ఇబ్బందుల నుంచి విముక్తి ప్రసాదించింది. 2020-21 వానకాలం సీజన్తో పోలిస్తే 2021-22 సీజన్లో ధాన్యం సేకరణ 20 శాతం అధికంగా ఉండడం విశేషం.
ఏడాదిలో ఎంత తేడా…
రాష్ట్రంలో అన్ని జిల్లాలతో పోలిస్తే నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో ముందస్తుగానే ధాన్యం సేకరణ ప్రక్రియ ముగింపునకు చేరింది. ఆలస్యంగా నాట్లు వేసిన ప్రాంతాల్లోనే కొద్ది మొత్తంలో వరి పంట సేకరణ ప్రక్రియ మిగిలి ఉంది. ఇక్కడ కూడా రెండు, మూడు రోజుల్లోనే సేకరణ పూర్తి కానున్నది. 2020-21 వానకాలంలో ఉభయ జిల్లాల్లో 786 కొనుగోలు కేంద్రాలు మాత్రమే ఉండగా… ఈసారి 802 కేంద్రాలను నెలకొల్పారు. వ్యవసాయ శాఖ అంచనాల మేరకు దిగుబడులు భారీగా వచ్చే అవకాశాలుండడంతో ప్రతి గ్రామానికి అనుబంధంగా కేంద్రాలను తెరిచారు. ఇందూరు ప్రాంత రైతన్నలు ఈసారి వానకాలం సీజన్లో తమకున్న మొత్తం భూమిని సాగులోకి తీసుకువచ్చారు. పంటలు పండించేందుకు సీఎం కేసీఆర్ అందిస్తున్న ప్రోత్సాహాన్ని దృష్టిలో పెట్టుకుని గణనీయంగా దిగుబడులు రాబట్టారు. నిజామాబాద్ జిల్లా వానకాలం 2020-21 సీజన్లో ధాన్యం సేకరణకు 445 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా ఈసారి 458 కేంద్రాలు తెరిచారు. సుమారు లక్ష మంది రైతుల నుంచి రూ.1300 కోట్ల విలువ చేసే 6.55 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. గత ఏడాది వానకాలంలో సేకరించిన ధాన్యం విలువ రూ.1048 కోట్లు కాగా ఈ సారి రూ.250 కోట్లు అదనంగా వెచ్చించారు. కామారెడ్డి జిల్లాలో గత ఏడాది వానకాలంలో 341 కొనుగోలు కేంద్రాలుంటే 2021-22 వానకాలంలో 344 ఏర్పాటు చేశారు. 2020-21 వానకాలంలో రూ.700.23 కోట్ల విలువ చేసే 3లక్షల 70వేల 946 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించగా ఈసారి మరింత ఎక్కువగా ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఇప్పటి వరకు రూ.899కోట్లతో 4.59లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించడం విశేషం. నిజామాబాద్ జిల్లాలో 456, కామారెడ్డి జిల్లాలో 267 కేంద్రాల్లో వందశాతం ధాన్యం సేకరణ పూర్తయ్యింది.
కేంద్రం అడ్డుపుల్లలు వేసినా…
ఉమ్మడి రాష్ట్రంలో ఆరుగాలం శ్రమించి పం డించిన పంట ఉత్పత్తులకు మద్దతు ధర లేక రైతులు విలవిల్లాడే పరిస్థితి. ధాన్యం కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో ప్రభు త్వం ప్రకటించిన మద్దతు ధర దక్కే అవకా శం లేకపోయేది. మార్కెట్ యార్డుల్లో వ్యాపారులు, మధ్యవర్తులు రైతుల పేరిట ధాన్యాన్ని విక్రయించకుండానే గోల్మాల్ చేసేది. కానీ ప్రస్తుతం పరిస్థితి అంతా మారిపోయింది. ఊరూరా ధాన్యం సేకరణ కేంద్రా లు ఏర్పాటు అయ్యాయి. కొనుగోళ్లలో పారదర్శకత రెట్టింపు అయ్యింది. రైతుల ఆధార్ కార్డు, పట్టాదారు పాసుపుస్తకం, బ్యాంకు ఖాతా పుస్తకాలను అనుసంధానం చేసి వారి ఖాతాల్లోనే చెల్లింపులు జరిగేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. వ్యవసాయ మార్కెట్ యార్డులకు రైతులు ధాన్యం తీసుకెళ్తే వ్యాపారులు ఇష్టమొచ్చిన ధరకు కొనుగోలు చేసే పరిస్థితులకు కాలం చెల్లింది. పం డించిన ధాన్యానికి రైతులకు మద్దతు ధర దక్కేలా పౌరసరఫరాల సంస్థ ద్వారా పకడ్బందీ చర్యలు అమలయ్యాయి. రాష్ట్రంలో మర ఆడించిన బియ్యాన్ని సేకరించేందుకు కేంద్ర సర్కారు కొర్రీలు పెట్టినప్పటికీ రాష్ట్రం మాత్రం రైతు ప్రయోజనాల కోసం మద్దతు ధరను అందించింది. ధాన్యం సేకరణలో కేంద్రం ససేమిరా అన్నప్పటికీ సీఎం కేసీఆర్ సాహసోపేతంగా ధాన్యాన్ని సేకరించారు.
అనేక సవాళ్లు దాటుకుని సాగిన కొనుగోళ్ల ప్రక్రియ
నిజామాబాద్ జిల్లాలో రికార్డు స్థాయిలో ధాన్యం ఉత్పత్తులు వచ్చా యి. అయినప్పటికీ కరోనాను లెక్కచేయకుండా రైతులెవ్వరూ నష్టపోకుండా చర్యలు తీసుకున్నాం. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా కేంద్రాల్లో సకల సౌకర్యాలు కల్పించాం. ఎక్కడా చిన్న ఇబ్బంది కలుగకుండా ముందు నుంచి జాగ్రత్త పడడంతో మంచి ఫలితాలు వచ్చాయి.
రైతుకు నమ్మకాన్ని, ధైర్యాన్ని అందించాం
ధాన్యాన్ని ప్రభుత్వ ఆధ్వర్యంలో సాఫీగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు పూర్తి చేశాం. చివరి గింజ వరకూ సేకరించమే లక్ష్యంగా ప్రతి రైతు నుంచి ధాన్యాన్ని ప్రొక్యూర్ చేసి మద్దతు ధరను కల్పించాం. మధ్యలో చెడగొట్టు వానలు పడినప్పటికీ ప్రభుత్వ ఆదేశాల మేరకు తడిసిన ధాన్యాన్ని కూడా సేకరించి రైతులకు ఉపశమనం కల్పించాం. నిర్ణీత కాల వ్యవధిలోనే రైతుల బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు జమ చేసి నమ్మకం, ధైర్యాన్ని కల్పించాం.
బైబ్యాక్ ఒప్పందాలుంటేనే వరి సాగు
గతంలో యాసంగికి పంటలు పండించాలంటే రైతులు వెనుకా ముందు ఆలోచించుకునేది. భూగర్భ జలం, జలాశయాల్లో నీళ్లను ఆధారం గా చేసుకుని ముందడుగు వేసేది. భూమి ఉన్నప్పటికీ సాగు నీటి గోసతో పంటలు వేసేందుకు వెనుకడుగు వేసేది. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ తీసుకుంటున్న రైతు అనుకూల నిర్ణయాలతో ఏటేటా సాగు విస్తీర్ణం పెరుగుతూనే ఉంది. 2019- 20 యాసంగి సీజన్తో పోలిస్తే 2020 – 21 సీజన్లో నిజామాబాద్, కామారెడ్డి జిల్లా ల్లో వరి సాగు భారీగా పెరిగింది. రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తిలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ముందు వరుసలో ఉంది. ముందు నుంచి పకడ్బందీ వ్యూహం, పక్కా కార్యాచరణతో యంత్రాంగం పని చేస్తుండడంతో ఎలాంటి ఇబ్బందుల్లేకుండా సాఫీగా ధాన్యం సేకరణ జరిగింది. ఉమ్మడి జిల్లాలో యాసంగి 2020-21లో 11లక్షల 94వేల 685 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని అధికార యంత్రాంగం సేకరించింది. నిజామాబాద్ జిల్లాలో 7లక్షల 43 వేల 531 మెట్రిక్ టన్నులు, కామారెడ్డి జిల్లాలో 4లక్షల 51వేల 154 మెట్రిక్ టన్నుల మేర ధాన్యాన్ని రైతులు విక్రయించారు. వీటి మొత్తం రెండు జి ల్లాల్లో కలిపితే దాదాపు రూ.2,248కోట్లుగా ఉం ది. రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన ధాన్యంతో నిజామాబాద్లో 1,90,741 మందికి, కామారెడ్డి జిల్లాలో 1,12,367 మంది రైతులకు మద్దతు ధర దక్కింది. 2021-22 ముంచుకొస్తున్న యాసంగిలో వరికి బదులుగా ఇతర పంటలు సాగయ్యేలా ప్రభుత్వం కార్యాచరణను అమలు చేస్తున్నది. కొంతమంది రైతులు వరి సాగుకు మొగ్గు చూపుతుండగా ఆయా ప్రైవేటు వ్యక్తులు, సంస్థలతో బైబ్యాక్ ఒప్పందాలుంటేనే వేయాలంటూ వ్యవసాయ శాఖ సూచనలు చేస్తున్నది.