పసుపు బోర్డు హామీ నిలబెట్టు కోవాలంటూ నిలదీతలు
నిజామాబాద్, జూన్ 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి):కరోనా క్లిష్ట సమయంలో రాష్ట్ర ప్రభుత్వం సామాన్య ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉన్నది. ప్రభుత్వ దవాఖానల్లో టీకాల పంపిణీతో పాటు కరోనా చికిత్సకు రూ.కోట్లు వెచ్చించి ప్రజల్లో ధైర్యం నింపింది. ప్రాణాలు నిలబెడుతూ మానవత్వాన్ని చాటుకున్నది. నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో పాటు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత తమదైన రీతిలో ప్రజలకు సహాయం అందిస్తున్నారు. కష్టాల్లో ఉన్న అభాగ్యులకు ఆపన్నహస్తం అందించి ఆదుకున్నారు. కరోనా ఉధృతి తీవ్రంగా ఉన్న సమయంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఎక్కడా కనిపించలేదు. సోషల్ మీడియాలోనూ ఎంపీ ఎక్కడంటూ ట్రోలింగ్లు భారీగా రావడంతో జనరల్ దవాఖానకు ఒక రోజు వచ్చి మొక్కుబడిగా పరిశీలించి వెళ్లారు. అనంతరం ఇటువైపు ముఖం కూడా చూడని ఎంపీ తాజాగా కరోనా తగ్గుముఖం పట్టి ప్రజలంతా ఉపశమనం పొందుతున్న సమయంలో క్షేత్ర పర్యటనకు బయలుదేరాడు. ఇప్పటికే రైతుల నుంచి ఊహించని ప్రతిఘటన ఎదురవుతున్న వేళ పసుపు బోర్డు హామీని పక్కదారి పట్టించాలనే యోచనతో ఎంపీ అర్వింద్ తనదైన శైలిలో తాళ్లరాంపూర్లో దీక్షకు దిగేందుకు పూనుకున్నారు. కానీ, రైతన్నలంతా ఏకమై ఎంపీ తీరును ఎండగట్టారు. పసుపు బోర్డు ఏమైందంటూ ప్రశ్నిస్తూ గో బ్యాక్ అంటూ నినదించారు. బోర్డు తెస్తావా? రాజీనామా చేస్తావా? అంటూ మరోసారి పసుపు రైతులు కుండ బద్ధలు కొట్టి నిలదీయడంతో ఎంపీ ధర్మపురి అర్వింద్ ఉక్కిరిబిక్కిరికి లోనయ్యాడు.
పసుపు బోర్డును పక్కదారి పట్టించే కుట్ర..
ఐదు రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని చెప్పి ఎంపీ పీఠమెక్కినా అర్వింద్ ఎలాగైనా ఐదేండ్ల పాటు తన పదవీ కాలాన్ని గడిపేయాలని యోచిస్తున్నట్లు అర్థం అవుతున్నది. ఇందుకోసం పసుపు పంటకు సంబంధించి తానిచ్చిన హామీలను, ఇతరత్రా అంశాలు చర్చకు రాకుండా చాకచక్యంగా పక్కదారి పట్టించేందుకు యత్నిస్తున్నట్లు తెలుస్తున్నది. నిత్యం భావోద్వేగపు ప్రసంగాలు చేయడం, యువతను రెచ్చగొట్టే విధంగా సున్నితమైన అంశాల జోలికి వెళ్లడమే పరమావధిగా తన పంథాను కొనసాగిస్తున్నాడు. రైతులెవ్వరూ వీటిని పట్టించుకోకపోవడంతో రాజకీయ అంశాలను తెరపైకి తీసుకువస్తున్నాడు. రైతులకు ఉపయోగపడని అనవసరమైన అంశాలతో రాద్దాంతం చేసి వారి ఆలోచనలను మార్చేందుకు పథకం రచిస్తున్నాడు. ఇందులో భాగంగా సోమవారం కూడా పీఏసీఎస్ అక్రమాల పేరుతో దీక్షకు పూనుకునేందుకు ఏర్గట్ల మండలంలోని తాళ్లరాంపూర్కు రావడంతో ఎంపీ అర్వింద్కు రైతులు చుక్కలు చూపించారు. ఎంపీ రాకను అడ్డుకోవడంతో పాటు పసుపు బోర్డు ఏమైదంటూ నిలదీశారు. రైతుల నుంచి ఊహించని ప్రతిఘటన ఎదురవడంతో ఎంపీ కనీసం కారు దిగేందుకు కూడా సాహసించలేక మిన్నకుండిపోయాడు. పోలీసులు భద్రతా వలయం ఏర్పాటు చేయడంతో రైతుల ఆగ్రహం నుంచి అర్వింద్ తప్పించుకున్నాడు.
మొన్న చౌట్పల్లి… నేడు తాళ్లరాంపూర్…
పసుపు బోర్డు ఏర్పాటు చేయకపోతే రాజీనామా చేస్తానని చెప్పిన ఎంపీ అర్వింద్ను పసుపు రైతులు వెంటాడుతున్నారు. హామీలు అమలు చేయకపోతే రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని కోరుతున్నారు. పసుపు రైతుల నుంచి ఉవ్వెత్తున వెల్లువెత్తుతున్న ఆగ్రహావేశాలతో ఎంపీ ధర్మపురి అర్వింద్ 2021, జనవరి 23 నాడు చౌట్పల్లిలో రైతులను మోసగించాలని ఆలోచించాడు. తనకు అనుకూలంగా ఉన్న కొంత మంది రైతులు, రైతు నాయకులు, బీజేపీ శ్రేణులతో ముఖాముఖి సమావేశం ఏర్పాటు చేసుకుని అనుకూలంగా పసుపు బోర్డు వద్దని చెప్పించాలని ప్రయత్నించాడు. ఎంపీ అంతరంగాన్ని పసిగట్టిన పసుపు రైతులంతా ఈ సమావేశానికి హాజరయ్యారు. నిజమైన రైతులంతా ఎంపీ ప్రసంగానికి అడ్డుతగిలారు. రాజీనామా ఒక్కటే ఏకైక మార్గమంటూ భీష్మించుకుని కూర్చున్నారు. రైతుల నిలదీతలతో చౌట్పల్లి ముఖాముఖి సమావేశం నుంచి అర్ధాంతరంగా బయటికి వెళ్లిపోగా… సోమవారం తాళ్లరాంపూర్లోనూ అదే ఘటన రిపీట్ అయ్యింది. కర్షకుల కన్నెర్ర చేయడంతో చేసేది లేక మిన్నకుండిపోవడమే తనవంతైంది. రాజకీయ ప్రకటనలు చేసి పసుపు బోర్డు అంశాన్ని మాట వరుసకైనా లేవనెత్తకుండా నిరసనల మధ్యనే ఎంపీ వెనుతిరగడం గమనార్హం.
వెంటాడుతున్న పసుపు బోర్డు హామీ.. నిజామాబాద్, జగిత్యాల జిల్లాలో పసుపు బోర్డు జోరుగా సాగవుతున్నది. ఈ ప్రాంతంలోని రైతులు దేశంలోనే ప్రత్యేకతను సంపాదించారు. పసుపు బోర్డు ఏర్పాటు అన్నది వీరి దశాబ్దాల నాటి కల. వీరి మేలు కోసం 2014 నుంచి 2019 వరకు ఎంపీగా కల్వకుంట్ల కవిత చేయని ప్రయత్నం లేదు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంతో పలు దఫాలుగా చర్చలు జరిపారు. ఆఖరుకు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ స్పందించి స్పైసెస్ బోర్డు ఎక్స్టెన్షన్ కార్యాలయాన్ని మంజూరు చేస్తామని ప్రకటించింది. 2017లో వెలువడిన ఈ ప్రకటనను ఎంపీగా కల్వకుంట్ల కవిత తీవ్రంగా వ్యతిరేకించారు. పసుపు రైతులకు బోర్డు మినహా మరేది ప్రత్యామ్నాయం కాదని తేల్చి చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీతో సహా ఎన్డీయే పెద్దలతో భేటీ అయ్యారు. చివరి వరకు ప్రయత్నం చేశారు. 2019 సాధారణ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీకి దిగిన ధర్మపురి అర్వింద్ రైతుల సెంటిమెంట్ను తన రాజకీయానికి వాడుకున్నాడు. తనను గెలిపిస్తే ఐదు రోజుల్లోనే పసుపు బోర్డు తెస్తానని బహిరంగ ప్రకటన చేశాడు. అంతేకాకుండా పసుపు బోర్డు తేకపోతే రాజీనామా చేస్తానంటూ బాండ్ పేపర్ కూడా రాసిచ్చాడు. అర్వింద్ ఎంపీగా గెలిచి రెండేండ్లు దాటినప్పటికీ పసుపు బోర్డుపై అతీగతీ లేదు. లోక్సభ, రాజ్యసభలో కేంద్ర సర్కారే స్వయంగా పసుపు బోర్డు పెట్టబోమని తేల్చి చెప్పినప్పటికీ నిజామాబాద్ ఎంపీ మాత్రం తమకేమి పట్టనట్లు వ్యవహరిస్తుండడాన్ని పసుపు రైతులు తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు.