జక్రాన్పల్లి, ఏప్రిల్ 27 : పార్కు లు అనగానే ప్రధానంగా గుర్తుకు వచ్చేవి పట్టణాలు, నగరాలు. అందులోని రకరకాల పూలు, పండ్ల మొక్కలు, పచ్చికబయళ్లు ప్రజలకు ఆహ్లాదాన్నిస్తాయి. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం పల్లెప్రగతిలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రకృతి వనాలతో ప్రతి గ్రామం నందనవనంలా మారుత్నునది. గ్రామీణ ప్రజలు సైతం పార్కుల అందాలను ఆస్వాదిస్తూ సర్కారును మెచ్చుకుంటున్నారు. జక్రాన్పల్లి మండలంలోని నారాయణపేట్ గ్రామంలో ఏర్పాటు చేసిన పల్లెప్రకృతి వనం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నది. గ్రామానికి సమీపంలో ఉన్న అటవీ ప్రాంతాన్ని ఆనుకొని వనం ఏర్పాటు చేయడంతో ఆ ప్రాంతానికే వన్నే తెచ్చింది. అందమైన పూల మొక్కలు, ఆకట్టుకునే గార్డెన్, పండ్ల మొక్కలతో వనం ప్రకృతి రమణీయతకు కొత్తరూపాన్ని ఇచ్చింది. దీంతో గ్రామస్తులు ఖాళీ సమయాల్లో వనాన్ని సందర్శించి ఆహ్లాదాన్ని ఆస్వాదిస్తున్నారు. పార్కులో సేద తీరేందుకు బెంచీలను, వాకింగ్ ట్రాక్ను ఏర్పాటు చేయడంతో వాకర్ల ఇబ్బందులు తీరాయి. ప్రభుత్వం అందిస్తున్న నిధులతో ప్రకృతి వనం, వైకుంఠధామం, కంపోస్టు షెడ్డు తదితర పనులు పూర్తిచేసుకొని గ్రామాన్ని ప్రగతిబాటలో నడిపిస్తున్నారు. గ్రామంలో మౌలిక సదుపాయాలు అందుబాటులోకి రావడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తంచేస్తున్నారు.
వైకుంఠధామంతో తొలగిన ఇబ్బందులు
గ్రామంలో ఎవరైనా చనిపోతే అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు పడే ఇబ్బందులు తొలగిపొయాయి. ప్రభుత్వం అందించిన రూ. 10 లక్షల నిధులతో వైకుంఠధామం నిర్మించారు. అదేవిధంగా స్నానాలు చేసేందుకు నీటి వసతి కల్పించి, ప్రత్యేక గదులను నిర్మించారు.
పకడ్బందీగా చెత్త సేకరణ
గ్రామంలో చెత్త సేకరణ కార్యక్రమం ప్రతి రోజూ నిర్వహిస్తున్నారు. గ్రామాలు స్వచ్ఛంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అందించిన ట్రాక్టర్తో తడి, పొడి చెత్తను సేకరించి, రూ.2 లక్షల నిధులతో నిర్మించిన కంపోస్టు షెడ్కు తరలిస్తున్నారు.
సకాలంలో పనులు పూర్తి చేశాం
ప్రభుత్వం అమలు చేస్తున్న పల్లె ప్రగతి కార్యక్రమాలను నిర్లక్ష్యం చేయకుండా వందకు వంద శాతం పూర్తి చేశాం. ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సహకారంతో గ్రామాభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతున్నాం. పల్లె ప్రగతితో పారిశుద్ధ్య సమస్య తీరింది. ప్రభుత్వం అందిస్తున్న నిధులతో గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నాం.
-రబ్బ వెంకట్, సర్పంచ్