ఇందూరు, జూన్ 27 : జూలై ఒకటి నుంచి పది రోజుల పాటు చేపట్టనున్న పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలపై సోమవారం సమన్వయ సమావేశం నిర్వహించనున్నట్లు కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన సెల్ కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారులతో మాట్లాడారు. జిల్లాకేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో మధ్యాహ్నం రెండు గంటలకు నిర్వహించనున్న సమన్వయ సమావేశంలో ప్రణాళికను సిద్ధం చేసి, లక్ష్యాలు నిర్దేశించనున్నామని తెలిపారు. ఈ సమావేశానికి మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ముఖ్యఅతిథిగా, జిల్లాలోని ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా హాజరవుతారని చెప్పారు. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు పకడ్బందీగా నిర్వహించడంతోపాటు వందశాతం లక్ష్యాలు సాధించాలన్నారు. ఇందుకోసం ప్రతి గ్రామపంచాయతీకి, మున్సిపాలిటీల్లోని ప్రతి వార్డుకు వేర్వేరుగా ఒక ప్రత్యేకాధికారిని నియమించాలని ఆదేశించారు. ప్రత్యేకాధికారులకు లక్ష్యాలు తెలిసి ఉండాలన్నారు. సమన్వయ సమావేశానికి మున్సిపల్ చైర్పర్సన్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ కమిషనర్లు, ఆర్డబ్ల్యూఎస్, ఆర్అండ్బీ, పంచాయతీరాజ్, ఎలక్ట్రిసిటీ ఇంజినీరింగ్ అధికారులు, ఆర్డీవోలు, ఎంపీడీవోలు, ఏపీవోలు, ఎంపీవోలు, తహసీల్దార్లు, డీఎల్పీవోలు హాజరయ్యేలా చూడాలని అధికారులకు సూచించారు. కార్యక్రమాలు పక్కాగా పూర్తిస్థాయిలో నిర్వహించడానికి నెలాఖరులోపు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. గ్రామాలు, మున్సిపాలిటీలు క్లీన్ అండ్ గ్రీనరీగా కనిపించాలన్నారు. ఈనెల 29న కార్యక్రమాలపై అన్ని మున్సిపాలిటీలు, మండల స్థాయిలో సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ కాన్ఫరెన్స్లో మున్సిపల్ కమిషనర్ జితేశ్ వీ పాటిల్, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, ఆర్డీవోలు రాజేశ్వర్, శ్రీనివాస్, డీఆర్డీవో చందర్నాయక్, డీపీవో జయసుధ తదితరులు పాల్గొన్నారు.