ధర్పల్లి, జూన్ 26 : ఇల్లు లేని నిరుపేదలకు గూడు కల్పించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేప్టటింది. ధర్పల్లి మండల కేంద్రంలో 50 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం కోసం ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రెండున్నర ఏండ్ల క్రితమే మంజూరు చేయించారు. కానీ, సరైన స్థలం లేక కొంతమేర ఆలస్యం జరిగింది. పేదలకు ఎలాగైనా ఇండ్లు కట్టించి ఇవ్వాలన్న తపనతో ఉన్న ఎమ్మెల్యే.. రెవెన్యూ అధికారులతో మాట్లాడి డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి స్థలం కేటాయించేలా చర్యలు చేపట్టారు. అప్పటినుంచి ఇండ్ల నిర్మాణ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి.
తుది దశలో పనులు..
మండలకేంద్రంలోని భీంగల్ రోడ్డులో ఉన్న మాలగుట్ట శ్రీ జగన్నాథ ఆలయానికి వెళ్లే దారి పక్కన సర్వే నంబర్ 195లో 1.08 ఎకరాల భూమిని డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి కేటాయించారు. దీంతో గతేడాది జనవరి 2న జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ ఇండ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు. అయితే లాక్డౌన్తో మధ్యలో కొంతకాలం పనులు నిలిచిపోవడంతో, నిర్మాణంలో జాప్యం చోటు చేసుకుంది. కానీ, ఇండ్ల నిర్మాణ పనులు త్వరగా నిర్మించి నిరుపేదలకు అందించాలన్న కృతనిశ్చయంతో ఉన్న ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులకు, నిర్మాణ పనులు చేపట్టిన కాంట్రాక్టర్కు ఆదేశాలు జారీ చేస్తూ యుద్ధ ప్రతిపాదికన పనులు కొనసాగేలా చూస్తున్నారు. జీ ప్లస్ వన్ పద్ధతిలో మొత్తం రెండు వరుసల్లో ఇండ్ల నిర్మాణం, ప్లాస్టరింగ్ పనులతో సహా పూర్తయి, అంతర్గత పనులు కొనసాగుతున్నాయి.
48 ఇండ్ల నిర్మాణం..
మండల కేంద్రంలో జీ ప్లస్ వన్ పద్ధతిలో 50 ఇండ్ల నిర్మాణం చేపట్టాలని మొదట అనుకోగా, స్థలాభావంతో ప్రస్తుతం 48 ఇండ్లు నిర్మిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇండ్ల నిర్మాణం ప్రారంభమై వేగవంతంగా కొనసాగి పూర్తి కావచ్చాయి. కాగా మండలంలోని దుబ్బాక గ్రామంలో సైతం ఎమ్మెల్యే 50 ఇండ్లు మంజూరు చేయించారు. పనులు సైతం గతంలోనే ప్రారంభించగా కాంట్రాక్టర్ ప్రారంభ దశలోనే అర్ధ్ధాంతరంగా వదిలేశారు. దీంతో ఎమ్మెల్యే మళ్లీ ప్రత్యేక దృష్టి సారించి అక్కడ కూడా త్వరలోనే ఇండ్ల నిర్మాణం పూర్తి చేసేలా కృషిచేస్తున్నారు.
ఇల్లు లేని పేదలకు లబ్ధి చేకూరుస్తా..
ధర్పల్లిలోని డబుల్ ఇండ్లలో బ్యాలెన్స్ వర్క్ను పూర్తిచేసి ఇండ్లు లేని నిరుపేదలకు అందజేస్తాం. రూరల్ నియోజకవర్గంలోని చాలాచోట్ల డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించాం. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో అర్హులకు అందజేశాం. అన్ని గ్రామాల్లో ఇండ్లు లేని నిరుపేదలకు లబ్ధి చేకూర్చాలన్నదే నా ఆలోచన. ఇండ్లు నిర్మించలేని గ్రామాల్లో అర్హులకు ఇండ్ల స్థలాలను అందజేస్తాం. వారు చూసుకున్న స్థలంలో ఇల్లు నిర్మించుకోవడానికి రూ.ఐదు లక్షలను ప్రభుత్వం తరఫున అందజేస్తాం. నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలన్నదే నా తపన.
-బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్యే, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం
ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కృషితోనే..
రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కృషితోనే డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలు వేగంగా సాగుతున్నాయి. నిర్మాణానికి ఎవరూ ముందు కు రాకున్నా.. ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ తీసుకు ని, నిరుపేదలకు ఇండ్లు అందించాలన్న పట్టుదలతో కాంట్రాక్టర్ను ఒప్పించి పనులు ప్రారంభమయ్యేలా చూశారు. పేదల అభ్యున్నతి కోసం పాటుపడుతున్న ఎమ్మెల్యేకు ప్రత్యేక కృతజ్ఞతలు.
-నల్ల హన్మంత్రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు, ధర్పల్లి